హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ..దీనికి సంబంధించి తెలంగాణను నష్టపరిచే ప్రతిపాదన ఏదీ తీసుకోబోమని కేంద్ర జలశక్తి మంత్రి CR పాటిల్ హామీ ఇచ్చారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చర్చలకు ఆహ్వానించారు.
ఈమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి N ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో మంత్రి CR పాటిల్ను కలిసింది, PBLPకి పర్యావరణ అనుమతులు, నిధులను పొందడంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఉల్లంఘనలను ఆయన దృష్టికి తీసుకువచ్చింది.
సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని,ఈ అంశంపై తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారని చెప్పారు.
“ఏపీ చేపట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ నిర్మాణంపై తెలంగాణ రైతుల ఆందోళనలను మేము తెలియజేశాము. గోదావరి బేసిన్లో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఓసీ ఇస్తే గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడంలో జరుగుతున్న అనవసర జాప్యాల గురించి ప్రతినిధి బృందం కేంద్ర మంత్రికి తెలియజేసిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు.
సమ్మక్క-సారక్క, పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిడిహట్టి (ప్రాణహిత-చేవెళ్ల/కాళేశ్వరం) ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో పాటు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు కూడా నిధులు కావాలని తెలంగాణ ప్రతినిధి బృందం కోరింది. అలాగే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2 ద్వారా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదాన్ని త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రతినిధి బృందం కేంద్ర మంత్రిని అభ్యర్థించింది.
గోదావరి-కృష్ణా-పెన్నార్ బేసిన్లను అనుసంధానిస్తూ ఇచ్చంపల్లి-నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్వారా నదుల అనుసంధానంపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉత్తమ్ అన్నారు.