లండన్ : ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా నిన్న భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్లో తొలి టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో అరంగ్రేటం చేస్తాడని భావించిన దేశీయ పరుగుల వీరుడు అభిమన్యు ఈశ్వరన్కు జట్టు మేనేజ్మెంట్ మొండి చేయిచూపింది. అతడి స్థానంలో తమిళనాడుకు చెందిన తన తోటి ఐపీఎల్ సహచరుడు సాయి సుదర్శన్కు కెప్టెన్ గిల్ అవకాశం ఇచ్చాడు.
అయితే సాయి సుదర్శన్ టెస్ట్ అరంగేట్రం కేవలం నాలుగు బంతుల్లోనే ముగిసింది. లంచ్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్ బౌలింగ్లో సుదర్శన్ కాలు పక్కగా వెళ్తున్న బంతిని నిక్ చేయగా, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జామీ స్మిత్ అద్భుతంగా తన కుడివైపుకు దూకి రెండు చేతులతో బంతిని పట్టుకున్నాడు. సుదర్శన్కు ఇది సరైన ప్రారంభం కాదు.
మొదటి టెస్ట్లో వైఫల్యం తర్వాత సుదర్శన్ను అంచనా వేయడం చాలా తొందరపాటే అయినప్పటికీ, అభిమానులు అతనిని జట్టులోకి తీసుకోవడం పట్ల సంతోషంగా లేరు. సుదర్శన్ అరంగేట్రం బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ను దెబ్బతీసింది, అతను దేశీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేసినప్పటికీ మరోసారి విస్మరణకు గురి అయ్యాడు.
దేశవాళీలో కింగ్
అభిమన్యు ఈశ్వరన్ పేరు వినగానే మొదట గుర్తుకురావాల్సింది అతడి నిలకడమైన ఆటతీరు. అతడి ఫస్ట్-క్లాస్ రికార్డులే ఇందుకు సాక్ష్యం. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడి 53.63 సగటుతో 7841 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ గణాంకాలు కేవలం అంకెలు కాదు, టెస్ట్ క్రికెట్కు కావాల్సిన క్రమశిక్షణ, ఓపిక, పరుగుల దాహం అతనిలో ఎంతగా ఉన్నాయో చెబుతాయి. మరోవంక ఈశ్వరన్ 2022లోనే జట్టుకు ఎంపికైనా ఇంకా అరంగేట్రం చేయలేదు. ఐపీఎల్ ప్రతిభను కొలమానంగా తీసుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. తుది జట్టులో ఈశ్వరన్కు చోటుదక్కపోవడంతో భారత జట్టు మెనెజ్మెంట్పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
రంజీల్లో ఆడితే సరిపోదు..!
దేశీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయిన రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తే కాదు, ఐపీఎల్లో బాగా రాణిస్తేనే టీమిండియా తరపున ఆడే అవకాశం లభిస్తుందని సెటైర్లు వేస్తున్నారు.
అది మరోసారి రుజువైందని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. సాయిసుదర్శన్కు కెప్టెన్ శుభమన్ గిల్ సపోర్ట్ ఉందని, ఈశ్వరన్కు ఎవరి మద్దతు లేకపోవడంతో ఛాన్స్ లభించడం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
కాగా ఐపీఎల్ గుజరాత్ బైటాన్స్ జట్టుకు గిల్, సాయిసుదర్శన్ కలసి ఆడుతున్న కారణంగా అతడికి ఛాన్స్ దక్కిందన్న విమర్శలు పెరిగాయి.
కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి టెస్ట్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు నిలకడగా ఆడుతూ మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించి భారీ స్కోరువైపు దృష్టి సారించింది. యశస్వీ జైస్వాల్, కెప్టెన్ గిల్ సెంచరీలు సాధించారు. కెఎల్ రాహుల్ 42 పరుగులు సాధించి ఔట్ కాగా, రిషబ్ పంత్ 65 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
గత దశాబ్దంగా బ్యాటర్ ఫ్రెండ్లీగా ఉన్న హెడింగ్లీ ట్రాక్ ఇటీవలే పరివర్తన చెందింది. దీంతో ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. దీనికి అనుగుణంగా మ్యాచ్ మొదటి సెషన్లోనే బంతి బాగానే మూవ్ అయినట్లు కనిపించింది. కానీ ఎండ ఎక్కువగా రావడంతో ఉదయం భారత ఓపెనర్లు పనిని పూర్తి చేశారు.
మరోవంక ఇంగ్లండ్ జట్టులో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. బలహీనమైన పిచ్పై భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బౌలర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నట్లు అనిపించలేదు.
స్టోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్లతో కూడిన బౌలర్లు.. భారతజట్టు ఓపెనర్లు అయిన రాహుల్, జైస్వాల్లకు షార్ట్పిచ్ బాల్లు వేసి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది. కానీ ఆ నిర్ణయం వర్కౌట్ కాలేదు. మన బ్యాటర్లు మంచి ఓపెనింగ్ పార్టనర్ షిప్తో మూడో వికెట్కు వందకు పైగా పరుగులు జోడించి ఇంగ్లండపై ఆధిపత్యం చెలాయించారు.