న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి తన ఉపాధ్యాయుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఈమేరకు బాలుడి తండ్రి కేసు నమోదు చేశాడు. ముగ్గురు ఉపాధ్యాయులు, పాఠశాల ప్రిన్సిపాల్ తన కొడుకును మానసికంగా వేధించారని, దీన్ని తట్టుకోలేక తన ప్రాణాలను కూడా తీసుకోవలసి వచ్చిందని ఆరోపించారు.
సూసైడ్ నోట్లో బాలుడు ఏం రాసాడంటే…”, ఆప్కా దిల్ ఇత్నీ బార్ తోడా, అబ్ లాస్ట్ బార్ తోడుంగా. స్కూల్ కి టీచర్స్ అబ్ హై హై ఐసే, క్యా బోలు (క్షమించు మమ్మీ, నేను చాలాసార్లు మీ హృదయాన్ని గాయపరిచా…ఇక ఇదే చివరిసారి. స్కూల్లో టీచర్లు చేసే పని ఇలా ఉంది. నేనేం చేయాలి చెప్పు అని రాసుకున్నాడు.
ఎఫ్ఐఆర్ నివేదికానుసారం… టీనేజర్ తండ్రి తన కుమారుడు మంగళవారం ఉదయం 7.15 గంటలకు సాధారణ సమయానికి పాఠశాలకు బయలుదేరాడని చెప్పాడు. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో 16 ఏళ్ల బాలుడు గాయపడి పడి ఉన్నాడని తండ్రికి ఫోన్ వచ్చింది. తండ్రి తన కొడుకును బిఎల్ కపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లమని ఫోన్ చేసిన వ్యక్తిని కోరాడు. అయితే వారు అక్కడి చేరుకునే సరికే బాలుడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో కుమారుడిని కోల్పోయిన తండ్రి మాట్లాడుతూ… ‘గత కొద్ది రోజులుగా నా కుమారుడిని పాఠశాలలోని ముగ్గురు ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ వేధిస్తున్నారు. మంగళవారం ఒక డ్రామా క్లాసులో నా కుమారుడు పడిపోతే, ఒక టీచర్ అతనిని అవమానించి, అతిగా నటిస్తున్నావని ఎగతాళి చేశారు. దీంతో నా కుమారుడు ఏడవడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ, ఆ టీచర్ నువ్వు ఎంత ఏడ్చినా పట్టించుకోను అని అన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు ప్రిన్సిపాల్ అక్కడే ఉన్నా, తన కుమారునిపై వేధింపులను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు’ అని ఆరోపించారు.
తన కుమారుడు గతంలో కూడా… తనకు, తన భార్యకు బోధనా సిబ్బంది మానసిక వేధింపుల గురించి ఫిర్యాదు చేశాడని, వారు పాఠశాలలో ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని అతడు చెప్పాడు. 10వ తరగతి పరీక్షలు త్వరలో జరగనున్నందున తాము కఠినమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకున్నామని తండ్రి PTIకి తెలిపారు.
“అతని పరీక్షలు ఒకటి లేదా రెండు నెలల్లో జరగాల్సి ఉంది. మావాడికి ఇరవై మార్కులు వస్తున్నాయి. నేను దేనినీ ఇబ్బంది పెట్టాలనుకోలేదు” అని ఆయన అన్నారు, పరీక్షలు ముగిసిన తర్వాత టీనేజర్ను వేరే పాఠశాలలో చేరుస్తామని తామ హామీ ఇచ్చామని ఆయన అన్నారు.
సూసైడ్ నోట్
బాలుడి బ్యాగులో దొరికిన సూసైడ్ నోట్లో…ఈ లేఖ ఎవరికి దొరికిందో వారు ఒక నిర్దిష్ట నంబర్కు కాల్ చేయమని విజ్ఞప్తి చేశాడు. నా అవయవాలు పని చేసే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయండి అని రాశాడు. తన పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లను తెలియజేస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని, తద్వారా మరే విద్యార్థీ తనలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా చూడాలని వేడుకున్నాడు. తన అన్నయ్యకు, తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలిచిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ, తండ్రిని, సోదరుడిని చక్కగా చూసుకోవాలని కోరాడు. ఉపాధ్యాయులు నన్ను వేధించారు. నాకు ఇక వేరే మార్గం లేదు అని రాసుకొచ్చాడు.


