హైదరాబాద్: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (SCERT) చేపట్టిన “హర్ ఇండియన్ కా మూన్షాట్” కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల నుండి 59 మంది విద్యార్థులు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడానికి ఎంపికయ్యారు.
అగస్త్య ఫౌండేషన్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో SCERT నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రకళ, వ్యాస పోటీల ద్వారా ఈ విద్యార్థులను ఎంపిక చేశారు.
ఈ విద్యార్థులతో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు కూడా ఉంటారు, ఈ సందర్శన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (TGSRTC) బస్సులలో వారు ప్రయాణిస్తారు. ఈ టూర్ ద్వారా విద్యార్థులు రాకెట్ లాంచ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటారు. శాస్త్రవేత్తల పని విధానం అవగాహన పొందుతారు.
అంతేకాదు ఈ పర్యటన ద్వారా విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ ప్రయోగాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని ప్రత్యక్షంగా చూసి తెలుసుకోనున్నారు. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, వాస్తవ ప్రపంచంలోని విజ్ఞానంతో విద్యార్థులను అనుసంధానించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. భవిష్యత్తులో దేశానికి అవసరమైన శాస్త్రవేత్తలను తయారు చేయడంలో ఇటువంటి పర్యటనలు ఎంతగానో దోహదపడతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

