సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎరిత్రో ఫార్మా లిమిటెడ్లో నిన్న సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కార్మికులు రసాయన ద్రావకాలను లోడ్ చేస్తుండగా, ఒక రసాయన రియాక్టర్ నుండి వెలువడిన నిప్పురవ్వలు సమీపంలోని డ్రమ్ములలో నిల్వ ఉంచిన మండే పదార్థాలు అంటుకున్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి.
ఈ ఘటనతో పారిశ్రామిక ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, ఉద్యోగులను కంపెనీ ప్రాంగణం నుండి సురక్షితంగా తరలించారని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.
పటాన్చెరు, జీడిమెట్ల, నర్సాపూర్ నుండి మూడు అగ్నిమాపక వాహనాలు, రెండు పోలీసు వాహనాలతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అవి వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి. అన్ని అగ్నిమాపక వాహనాలు రాకముందే మంటల్లో అధిక భాగం అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యవసర బృందాలు, ఘటనా స్థలంలో ఉన్న పోలీసుల సంయుక్త కృషితో అగ్నిమాపక వాహనాలు రాకముందే మంటలు అదుపులోకి వచ్చాయని సమాచారం. అయితే, మంటలను పూర్తిగా ఆర్పివేసేందుకు అధికారులు కృషి చేసారు.
పేలుడుకు గల కారణంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది, ఏమేరకు నష్టం వాటిల్లిందో పూర్తి స్థాయి ఇంకా నిర్ధారించలేదు. పరిస్థితిని పర్యవేక్షించడానికి, అనంతర పరిణామాలను అంచనా వేయడానికి అధికారులు,అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలంలోనే ఉన్నారు. ఈ పేలుడు, తదనంతర అగ్నిప్రమాదం సమీపంలోని కార్మికులు, స్థానికులలో తీవ్ర ఆందోళనను సృష్టించాయి.
