హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత మూడు రోజుల్లో భారీ వర్షం పడిన సంగతి విదితమే. మార్చి 1 నుంచి 19 వరకు హైదరాబాద్లో 51.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణ వర్షపాతం 17.5 మిమీ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. హైదరాబాద్లో మార్చి నెలలో ఈ స్థాయిలో వర్షం కురియడం పదేండ్ల తర్వాత ఇదే తొలిసారి. 2014లో ఇదే హైదరాబాద్ నగరంలో మార్చి 5వ తేదీన అతి భారీ వర్షం కురిసింది. నాడు 38.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. 2015లో 18.77 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆకస్మికంగా భారీ వర్షపాతం రావడం, వడగళ్లు, ఉరుములు, బలమైన ఈదురుగాలులు నగరాన్ని అతలాకుతలం చేసాయి. ఈ అనూహ్య వర్షపాతం వాతావరణ మార్పులకు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.
ఖమ్మం, హకీంపేట, భద్రాచలం సహా పలు జిల్లాల్లో కూడా అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా భద్రాచలంలో మార్చి 1 నుంచి 19 వరకు రాష్ట్రంలో అత్యధికంగా 92.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
అయితే, సోమవారం నుండి భారీ వర్షపాతం తగ్గుతుందని, నగరం, ఇతర జిల్లాల్లో వేడి ఉష్ణోగ్రతలతో పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుంది అని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.