న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియా అంతటా అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో…బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ న్యూఢిల్లీకి చేరుకున్నారు.
ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలపై బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులతో అరాఘ్చీ చర్చలలో పాల్గొంటారని భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం Xలో తెలిపింది.
అంతేకాదు అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్తో ఉన్న చారిత్రక బంధాన్ని కొనసాగించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ పర్యటన ద్వారా అగ్రరాజ్యాలకు తమ దౌత్య బలం తగ్గలేదని చాటిచెప్పడంతో పాటు, భారత్ వంటి అగ్ర దేశాల మద్దతును కూడగట్టడం ఇరాన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అబ్బాస్ అరాఘ్చీ భారత పర్యటన కేవలం బ్రిక్స్ సదస్సుకే పరిమితం కాకుండా, ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.
హర్ముజ్ జలసంధి – భారత నౌకల రక్షణ
ఈ పర్యటనలో భారత్కు అత్యంత కీలకమైన అంశం ‘హార్ముజ్ జలసంధి’ గుండా సాగే నౌకల రవాణా. ప్రపంచ చమురు సరఫరాలో మూడింట ఒక వంతు ఈ మార్గం నుంచే జరుగుతుంది. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, భారత నౌకలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, సులభతరంగా రవాణా జరిగేలా ఇరాన్ విదేశాంగ మంత్రితో భారత ప్రభుత్వం లోతుగా చర్చించే అవకాశం ఉంది. ఇంధన భద్రత విషయంలో ఇరాన్ సహకారం భారత్కు ఇప్పుడు ఎంతో అవసరం.
హర్ముజ్ జలసంధి అంతరాయాలు యూరప్ ఇంధన సరఫరాలను దెబ్బతీశాయి
మరోవంక హర్ముజ్ జలసంధికి సంబంధించిన అంతరాయాల కారణంగా ఏప్రిల్లో మధ్యప్రాచ్యం నుండి యూరప్ దిగుమతులు తీవ్రంగా పడిపోయాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో సంఘర్షణ, నౌకా రవాణా అంతరాయాల కారణంగా, దిగుమతులు మార్చిలో రోజుకు 330,000 బ్యారెళ్ల నుండి ఏప్రిల్లో రోజుకు 60,000 బ్యారెళ్లకు పడిపోయాయని ఆ సంస్థ నివేదించింది.
వేసవి కాలంలో కొరతను నివారించడానికి యూరప్ కోల్పోయిన సరఫరాలలో కనీసం 80 శాతాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని IEA హెచ్చరించింది, కానీ భర్తీ దిగుమతులు ఆ స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయి.
అయతోల్లా ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సన్నాహాలు
దివంగత ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రాంతీయ మీడియా వేదికలు, టెలిగ్రామ్ ఛానెళ్లలో ప్రచారమవుతున్న నివేదికలు పేర్కొన్నాయి.
నివేదికల ప్రకారం…అంత్యక్రియల సమయంలో తొక్కిసలాటలను నివారించడానికి అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇరాకీ పౌరులతో సహా లక్షలాది మంది విదేశీయులు హాజరవుతారని కూడా వార్తలు వచ్చాయి.
