హేగ్: భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల అంశాలపై నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అటువంటి విమర్శలు దేశ ప్రజాస్వామ్య నిర్మాణం, సాంస్కృతిక వైవిధ్యం, 5,000 ఏళ్ల నాటి నాగరికతపై “అవగాహన లేకపోవడం” వల్లనే వస్తున్నాయని భారత్ స్పష్టం చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లో పర్యటించిన సమయంలో ఈ దౌత్యపరమైన చర్చలు తెరపైకి వచ్చాయి. ప్రధాని మోదీతో భేటీకి ముందు డచ్ ప్రధాని జెట్టెన్.. భారతదేశంలో మైనారిటీల హక్కులు, మీడియా స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రశ్న అడిగే వ్యక్తికి అవగాహన లోపం ఉండటం వల్లే మనం ప్రాథమికంగా ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొంటున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కార్యదర్శి (పశ్చిమ) సిబి జార్జ్ అన్నారు.
భారతదేశం 140 కోట్ల జనాభా కలిగిన, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. 5000 సంవత్సరాలకు పైగా పురాతన నాగరికత కలిగిన దేశం. ఇది ఒక వైవిధ్యభరితమైన దేశం. ఇక్కడ సంస్కృతిలో వైవిధ్యం, భాషలలో వైవిధ్యం, ఆహారంలో వైవిధ్యం, మతంలో వైవిధ్యం ఉన్నాయి… ప్రపంచంలో నాలుగు మతాలు ఒకేచోట పుట్టిన దేశం మరొకటి లేదు. హిందూమతం, బౌద్ధమతం, జైనమతం మరియు సిక్కుమతం. ఈ మతాలు భారతదేశంలోనే పుట్టి, ఇక్కడే వర్ధిల్లుతూనే ఉన్నాయి,” అని ఆయన అన్నారు.”భారతదేశంలో యూదు మతం 2500 సంవత్సరాలకు పైగా ఉంది. నిరంతరం సహజీవనం చేసింది. యూదు జనాభా ఎన్నడూ హింసను ఎదుర్కోని అతి కొద్ది దేశాలలో భారతదేశం బహుశా ఒకటి… ఏసుక్రీస్తు పునరుత్థానం జరిగిన వెంటనే క్రైస్తవ మతం భారతదేశంలోకి వచ్చింది. “భారతదేశంలో వర్ధిల్లుతూనే ఉంది… ప్రవక్త ముహమ్మద్ కాలంలోనే ఇస్లాం భారతదేశానికి వచ్చి, ఇక్కడ వర్ధిల్లింది,” అని ఆయన అన్నారు.ప్రధాని మోదీ రెండు రోజుల నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా సంయుక్త పత్రికా సమావేశం నిర్వహించకపోవడాన్ని ఒక డచ్ జర్నలిస్ట్ ప్రశ్నించి, పత్రికా స్వేచ్ఛ, ముస్లిం, చిన్న వర్గాలతో సహా మైనారిటీల హక్కులపై ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఈ వాగ్వాదం జరిగింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఉటంకిస్తూ, భారతదేశం ఒక “సజీవ ప్రజాస్వామ్యం” అని, ఇక్కడ “శాంతియుత అధికార బదిలీ” ఒక ముఖ్య లక్షణమని ఆ దౌత్యవేత్త అన్నారు. “ఇటీవల మనకు ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ శాతం ఎంత ఉందో మీరు తెలుసుకోవాలి. 90 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే భారతదేశపు గొప్పతనమని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని పచ్చిమాసియా కార్యదర్శి సిబి జార్జ్ అన్నారు.
ఇది ఇలా ఉండగా, డచ్ ప్రధాని జెట్టెన్ ఒక సోషల్ మీడియా పోస్ట్లో, “భారత్, నెదర్లాండ్స్ రెండూ ప్రజాస్వామ్యానికి, సుపరిపాలనకు, న్యాయంపై ఆధారపడిన ప్రపంచ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యతనిస్తాయి” అని నొక్కి చెప్పారు. రెండు దేశాల మధ్య గతంలో జరిగిన దౌత్యపరమైన సమావేశాలలో ప్రస్తావనకు వచ్చిన, చాలా కాలంగా కొనసాగుతున్న పిల్లల సంరక్షణ హక్కుల వివాదాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.


