టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన యుద్ధ కార్యదర్శి ఇరాన్పై “తీవ్రంగా” దాడి చేస్తామని హెచ్చరించిన కొద్దిసేపటికే, వరుసగా రెండో రోజు కూడా ఇరాన్లోని పలు లక్ష్యాలపై ” దాడులు” జరిపినట్లు అమెరికా సైనిక కేంద్ర కమాండ్ (సెంట్కామ్) తెలిపింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, దేశంలోని దక్షిణ ప్రాంతాలలో వాయు రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశారు. పశ్చిమ టెహ్రాన్, ఫార్స్ ప్రావిన్స్, బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపం, కిష్, మినాబ్, మధ్య ఇస్ఫహాన్లోని కొన్ని ప్రాంతాలలో పేలుళ్లు వినిపించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికే బలహీనంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం మరింత ఉద్రిక్తంగా మారింది.
దీనికి ప్రతిస్పందనగా, అమెరికా జరిపిన తాజా దాడులకు ప్రతిగా కువైట్, బహ్రెయిన్లోని స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. “రెండు విడతల ఆపరేషన్లలో, అలీ, అహ్మద్ అహ్మద్ వైమానిక దళ స్థావరాల్లోని యూఎస్ ఆర్మీకి చెందిన పద్దెనిమిది ముఖ్యమైన లక్ష్యాలపై దాడి చేశామని” గార్డ్స్ ఒక ప్రకటనలో తెలిపారని ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ పేర్కొంది. వారు “షేక్ ఇసా వైమానిక స్థావరాలపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారని” కూడా ఆ ప్రకటనలో తెలిపారు.
బహ్రెయిన్లోని యూఎస్ ఐదవ నౌకాదళంపై ఇరాన్ దాడి చేసిందని ఇరాన్ మీడియా అంతకుముందు నివేదించింది. అంతేకాదు ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఐఆర్జిసి ఒక ప్రకటనలో తెలిపింది. “ఈ ప్రాంతంలో నెలకొన్న అభద్రత కారణంగా, చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు రాకుండా హర్ముజ్ జలసంధిని తక్షణమే మూసివేసినట్లు ప్రకటించడమైనది” అని ఐఆర్జిసి వర్గాలు తెలిపినట్లు సిఎన్ఎన్ నివేదిక పేర్కొంది.
కాగా, హర్ముజ్ జలసంధిని మూసివేశారన్న ఇరాన్ వాదన అవాస్తవమని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. తాజా ఘర్షణలు చెలరేగినప్పటికీ, “ఈ రాత్రి కూడా వాణిజ్య నౌకలు హర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు కొనసాగిస్తున్నాయి” అని పేర్కొంది.
ఇరాన్పై టోమాహాక్ క్షిపణులతో దాడి
ఈమేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ… అమెరికా సంధానకర్తలు ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై టెహ్రాన్ సంతకం చేయకపోతే, అమెరికా దళాలు “రేపు రాత్రి” మళ్లీ బాంబులు వేస్తాయని, ఈ సందర్భంగా ఆయన ఒక బూతు పదాన్ని ఉపయోగించినట్లు సమాచారం.
“ఇరాన్ రాజధాని టెహ్రాన్కు 40 మైళ్ల [64 కిలోమీటర్ల] సమీపంలో ఉన్న కొన్ని లక్ష్యాలపై ఇరాన్ లోపల దాడి చేయడానికి 49 టోమాహాక్ క్షిపణులను ఉపయోగించారు” అని కూడా ట్రంప్ చెప్పారు. “అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, పర్షియన్ గల్ఫ్కు సమీపంలో ఉన్న దేశంలోని నైరుతి భాగంలో రాడార్ వ్యవస్థలను, వాయు రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి” అని అధ్యక్షుడు చెప్పినట్లు ఫాక్స్ నివేదించింది. ఆ నివేదిక ప్రకారం, ఇరాన్ ఉన్నతాధికారులు తనకు ఫోన్ చేసి బాంబు దాడులు ఆపమని అమెరికాను కోరారని కూడా ట్రంప్ చెప్పారు.
ఇరాన్ హెచ్చరిక
ఇదిలా ఉండగా, హర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు సృష్టిస్తే ఇరాన్ ధీటుగా ప్రతిస్పందిస్తుందని ఐఆర్జిసి ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్, బ్రిగేడియర్ జనరల్ మజీద్ మౌసావి హెచ్చరించారు. సీనియర్ అధికారులను ఉటంకిస్తూ… ఇరాన్ సీనియర్ అధికారులతో ఫోన్ కాల్లో నేరుగా చర్చలు జరిపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వాదన అవాస్తవమని ఇరాన్ మీడియా కూడా నివేదించింది. ఆ నివేదికల ప్రకారం, ఇరు పక్షాల మధ్య అలాంటి చర్చలు ఏదీ జరగలేదని స్పష్టం చేసింది.
బహ్రెయిన్,కువైట్లో వైమానిక దాడి సైరన్లు
మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఐఆర్జిసి ప్రకటించిన తర్వాత, బహ్రెయిన్లోని పలుచోట్ల వైమానిక దాడి సైరన్లు వినిపించాయి. “ప్రశాంతంగా ఉండండి, సమీపంలోని సురక్షిత ప్రదేశానికి వెళ్లండి” అని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.

