న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక బీజేపీ కుట్ర ఉందని, ఇది “ప్రజాస్వామ్య హత్య” అని కాంగ్రెస్ ఆరోపించింది. ఆమెను రాజ్యసభలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న ప్రయత్నమని ఆరోపించింది.
తెలంగాణలో ఆమె పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు, అక్కడ పెండింగ్లో ఉన్న ఒక క్రిమినల్ కేసు గురించి వెల్లడించలేదనే ఆరోపణలపై అభ్యంతరాలు రావడంతో, ఎన్నికల సంఘం పరిశీలన సమయంలో నటరాజన్ నామినేషన్ను తిరస్కరించింది.
30 నిమిషాలలోపే, కాంగ్రెస్ అత్యవసర విచారణ కోరుతూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించడానికి ఢిల్లీలోని ఈసీ కార్యాలయానికి చేరుకుంది. అయితే, ఎన్నికల సంఘం అధికారులను కలవడానికి ఆ ప్రతినిధి బృందాన్ని అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించడంపై ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్రంగా స్పందించారు.ప్రజాస్వామ్య ప్రక్రియను రహస్యంగా నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నామినేషన్లో తప్పులు దొర్లాయనడం,వివరాలు వెల్లడించలేదని చెప్పడమనేది పూర్తిగా అబద్ధమని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలనే బీజేపీ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతోనే, వారు ఇంత నీచానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఐఎన్సీ నుంచి సీటును లాక్కోవాలని చూస్తున్నారని కేసీ వేణుగోపాల్ అన్నారు. బీజేపీకి రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదని ఆరోపించారు. వారు ప్రతిచోటా ఓట్ల చోరీ చేయడానికి కంకణం కట్టుకున్నారని కేసీ వేణుగోపాల్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన చిన్నపాటి అంశం అయినా మిగిలి ఉంటే, ఎన్నికల సంఘం ఈ విషయంలో ఆలస్యం చేయకుండా జోక్యం చేసుకోవాలి. రేపు ఉదయం మాకు అపాయింట్మెంట్ ఇస్తే, అప్పటి వరకు వేచి ఉండేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. లేకపోతే, అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తామని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.”
మధ్యప్రదేశ్లో నెలకొన్న తీవ్ర రాజకీయ నాటకీయత మధ్య ఈ వివాదం చోటుచేసుకుంది. అంతకుముందు రోజు, పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరుకు విమానంలో వెళ్లకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. నటరాజన్ నామినేషన్ను తిరస్కరించిన తర్వాత, శాసనసభ్యులతో వెళ్తున్న విమానాన్ని రన్వే నుంచి వెనక్కి పిలిపించినట్లు సమాచారం.
కొన్ని నివేదికల ప్రకారం, ఎన్నికల సంఘం కాంగ్రెస్ వినతిపత్రాన్ని స్వీకరించి, రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక కోరనుంది. మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికలను తారుమారు చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే ఇది అని నటరాజన్ ఆరోపించారు. “అవసరమైన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ, అధికారంలో ఉన్న బీజేపీ మూడో అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఇదంతా మొదలైంది. వారు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాలరాసే రాజకీయాలకు పాల్పడుతున్నారని స్పష్టమైంది,” అని ఆమె అన్నారు.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, నామినేషన్ల దాఖలుకు గడువు జూన్ 8వ తేదీతోనే ముగిసిపోవడంతో, పరిశీలన చివరి రోజున నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారు. దీంతో ప్రత్యామ్నాయ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం కాంగ్రెస్కు లేకుండా పోయింది.
ఆమె నామినేషన్పై బీజేపీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గియా అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కోర్టులో తనపై పెండింగ్లో ఉన్న కేసు విషయాన్ని నటరాజన్ తన ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో ఆరోపించారు.
ఇదంతా ఒక పెద్ద రాజకీయ కుట్ర అని ఆరోపిస్తూ, బీజేపీ ఎన్నికల ప్రక్రియను అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని నటరాజన్ అన్నారు. “గతంలో మధ్యప్రదేశ్లో చేసినట్లే, వారు రాజ్యసభ ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం ఒక రాజ్యసభ సీటు లేదా ఒక నిర్దిష్ట అభ్యర్థికి సంబంధించిన విషయం కాదు. ఇది భారతదేశ భావన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ ఈ రోజు చేస్తున్న పెద్ద పోరాటానికి సంబంధించినది,” అని ఆమె అన్నారు.
కాంగ్రెస్ సీటును చేజిక్కించుకోవడానికి బీజేపీ అక్రమ ఎత్తుగడలకు పాల్పడుతోందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా ఆరోపించారు. “కాంగ్రెస్ రాజ్యసభ సీటును లాక్కోవడానికి బీజేపీ రాజకీయ మర్యాదకు సంబంధించిన ప్రతీ నియమాన్ని ఉల్లంఘిస్తోంది. మొదట, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడిన విమానానికి అనుమతిని ఆలస్యం చేశారు. ఆ తర్వాత, మీనాక్షి నటరాజన్ నామినేషన్పై దురుద్దేశపూర్వక అభ్యంతరం దాఖలు చేశారు. చివరగా, బీజేపీ నాయకులు అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళం సృష్టించారు,” అని కమల్ నాథ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
