జైపూర్/న్యూఢిల్లీ: జైపూర్లో తనపై, తన సహచరులపై జరిగిన దాడికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన వ్యక్తులే కారణమని కార్యకర్త అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ ఘటన జరిగినప్పటికీ, తాను ప్రణాళిక ప్రకారం చేపట్టబోయే న్యూఢిల్లీ యాత్రను కొనసాగిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
ఈమేరకు మద్దతుదారులను ఉద్దేశించి దీప్కే మాట్లాడుతూ…దాడి చేసినవారికి ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వారిని భయపెట్టే ప్రయత్నమే ఈ ఘటన అని ఆయన అభివర్ణించారు. ఈ దాడి తమ ఉద్యమాన్ని అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
“మేము భయపడటం లేదు. మా ఢిల్లీ యాత్ర ప్రణాళిక ప్రకారం కొనసాగుతుందని” దీప్కే అన్నారు. మద్దతుదారులు శాంతియుతంగా ఉండాలని, తమ ప్రచారానికి కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, జైపూర్లో స్థానిక కార్యకర్తలు, మద్దతుదారులతో దీప్కే సమావేశమైన సమయంలో ఈ దాడి జరిగింది. కొందరు వ్యక్తులు తన బృంద సభ్యులను అడ్డగించి, దాడి చేశారని, దీంతో ఆ ప్రదేశంలో ఉద్రిక్తతలు తలెత్తాయని ఆయన ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అయితే, ఇందులో పాల్గొన్న వారి గుర్తింపును గానీ, వారు ఏ సంస్థకు చెందినవారో గానీ అధికారులు బహిరంగంగా ధృవీకరించలేదు. ఈ దాడికి బాధ్యత వహిస్తుందని పేర్కొంటూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. దీప్కే ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ వెంటనే స్పందించలేదు. రాజకీయ హింసా ఘటనలలో తమ ప్రమేయం లేదని ఆ సంస్థ గతంలో ఖండించింది. తాము దేశ నిర్మాణ కార్యక్రమాలకు కట్టుబడి ఉన్న ఒక సామాజిక-సాంస్కృతిక సంస్థ అని కూడా అది పేర్కొంది.
ఈ ఘటన రాజకీయ ప్రతిచర్యలను రేకెత్తించింది. దీప్కే మద్దతుదారులు ఈ దాడిని ఖండిస్తూ, జవాబుదారీతనం కోరాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించడానికి సమగ్ర విచారణ జరపాలని పలు పౌర సమాజ సమూహాలు కూడా పిలుపునిచ్చాయి.
వివాదం ఉన్నప్పటికీ, ఈ యాత్ర శాంతియుతంగా, ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా కొనసాగుతుందని పేర్కొంటూ, న్యూఢిల్లీ వైపు తన పాదయాత్రను కొనసాగించాలనే తన సంకల్పాన్ని దీప్కే పునరుద్ఘాటించారు.

