కోల్కత: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. దోపిడీ వసూళ్లు, అక్రమ కమీషన్ డబ్బును మళ్లించడానికి ఈ ఖాతాలను ఉపయోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవంక ఈ మూడుబ్యాంకు ఖాతాలపై బిధాన్నగర్ నగర పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం సమగ్ర ఫోరెన్సిక్ పరీక్షను ప్రారంభించింది.
ఈ దర్యాప్తుకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ఉత్తర 24-పరగణాల జిల్లాలోని బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అధికారులు, ఈ ఖాతాల ద్వారా నిధుల ప్రవాహాన్ని గుర్తించేందుకు గత ఐదేళ్ల లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
దర్యాప్తు అధికారులు…ఈ ఖాతాలోకి వచ్చిన, బయటకు వెళ్లిన లావాదేవీలను పరిశీలిస్తున్నారు. డిపాజిట్ల మూలం, ఆ తర్వాత డబ్బు బదిలీ అయిన గమ్యస్థానాలపై దృష్టి సారిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులను స్వీకరించడానికి ఈ ఖాతాలను ఉపయోగించారా, ఆ నిధులను తర్వాత వేరే చోటికి మళ్లించారా అనే విషయాలను నిర్ధారించడమే ఈ దర్యాప్తు లక్ష్యం.
అధికారులు ఈ ఖాతాలకు సంబంధించిన కీలక పరిపాలనా వివరాలను కూడా ధృవీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఖాతాలు తెరిచిన తేదీలు, ఏ పేర్లతో నమోదు చేశారు, సంవత్సరాలుగా వాటిని నిర్వహించిన అధీకృత సంతకాలదారుల గుర్తింపు వంటి వివరాలను తనిఖీ చేస్తున్నారు.
వర్గాల సమాచారం ప్రకారం, బెదిరింపులు, అక్రమ కమీషన్ల ద్వారా సేకరించిన డబ్బును ఇతర ప్రయోజనాలకు మళ్లించే ముందు ఖాతాలలో జమ చేశారన్న ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఏవైనా ఆధారాల కోసం లావాదేవీల సరళిని విశ్లేషిస్తున్నారు.
బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పలువురు రెబెల్ టీఎంసీ శాసనసభ్యులు చేసిన ఫిర్యాదులతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. తమ ఫిర్యాదులలో, బెదిరింపుల ద్వారా సేకరించిన నిధులను మూడు ఖాతాలలో ఉంచారని శాసనసభ్యులు ఆరోపించారు.
ఫిర్యాదుల ఆధారంగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అధికారిక దర్యాప్తును ప్రారంభించారు. విచారణ ప్రాథమిక దశలో భాగంగా, అధికారులు సంబంధిత బ్యాంకును మూడు ఖాతాలపై డెబిట్ ఫ్రీజ్ విధించాలని ఆదేశించారు, తద్వారా ఎలాంటి ఉపసంహరణలు లేదా బయటి లావాదేవీలను నిరోధించారు.
తృణమూల్ కాంగ్రెస్లో తీవ్రమవుతున్న అంతర్గత అధికార పోరాటం నేపథ్యంలో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. పోలీసు చర్యకు కొద్ది రోజుల ముందు, మాజీ రాష్ట్ర మంత్రి,మాజీ పార్టీ కోశాధికారి అరూప్ బిస్వాస్ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కోరుతూ ప్రైవేట్ రంగ బ్యాంకుకు లేఖ రాశారు. తన ప్రకటనలో, అధికార పార్టీలోని వర్గపోరాటాల నేపథ్యంలో పార్టీ నిధుల నియంత్రణ, నిర్వహణపై వివాదం కొనసాగుతోందని బిస్వాస్ పేర్కొన్నారు.
ఈ నిలిపివేత అప్పటి నుండి ఒక న్యాయ పోరాటానికి దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీలకు విధేయంగా ఉంటున్న తృణమూల్ కాంగ్రెస్ వర్గం ఒకటి, ఈ చర్యను సవాలు చేస్తూ సోమవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్లో, ఆ వర్గం డెబిట్ ఫ్రీజ్ను ఏ అధికారంతో విధించారో ప్రశ్నించింది. ఖాతాలపై విధించిన ఆంక్షలకు చట్టపరమైన ఆధారాన్ని నిర్ధారించడానికి న్యాయ జోక్యం కోరింది.
ఖాతాల నియంత్రణపై చట్టపరమైన వివాదం కోర్టులో నడుస్తుండగా, దర్యాప్తు అధికారులు ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నందున, ఈ కేసు గణనీయమైన రాజకీయ పరిణామాలకు దారితీస్తుందని భావిస్తున్నారు.
