ములుగు: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ పరిపాలన, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం ములుగులో రూ.150 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఉన్నారు.
హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి హెలికాప్టర్లో వచ్చిన మంత్రి కేటీఆర్కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనస్వాగతం లభించింది. అనంతరం డిగ్రీ కళాశాల సమీపంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)కి, జిల్లా పోలీసు కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మోడల్ బస్టాండ్ కాంప్లెక్స్, సంత్ సేవాలాల్ భవనానికి శంకుస్థాపన చేశారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు సమీపంలోని రామప్పలో నిర్వహించిన సాగునీటి దినోత్సవంలో ప్రసంగించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ నినాదాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని వివరించారు.
ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయినా వివక్ష చూపించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ ఒక్కరోజే రూ.133 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు నియోజకవర్గంలో 17 వేల ఎకరాలకు పోడుభూముల పట్టాలు అందజేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమాల అనంతరం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాన్ని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు.. మంత్రులు దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మహమూద్అలీతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్, సంపత్కుమార్శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.