హైదరాబాద్: రాష్ట్రంలో ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్’ (VB-G RAM G) పథకం అమలును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, న్యాయపరంగా పోరాడాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఈమేరకు నిన్న రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం తీసుకొస్తున్న ఈ పథకానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ చేసిన తీర్మానాలను పట్టించుకోకుండా, కొత్త మార్పులను రుద్దిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉండటంతో దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.
గతంలో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGS)గా ఉన్న ఈ పథకాన్ని VB-G RAM Gగా మార్చి అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, తెలంగాణ అసెంబ్లీ జనవరి 2026లోనే ఏకగ్రీవ తీర్మానం చేసిందన్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు విషయంలో ఇతర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో అధ్యయనం చేయడానికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా గతంలో ఏర్పాటు చేశారు.
ఈ విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం పరిధిలోకి ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1.5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందిని కూడా చేర్చనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు.
అంతేకాదు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా, దేశంలోని కూలీల అభిప్రాయాలకు భిన్నంగా ఉపాధి హామిని వీబీ జీ రాంజీ పేరుతో ఒంటెద్దు పోకడతో ఈ నెల 1న ప్రవేశపెట్టారు. కొన్ని రాష్ట్రాలు అనివార్యంగా ఒప్పుకున్నట్లు తెలంగాణ కూడా గత్యంతరం లేక అంగీకరించాల్సి వచ్చింది. న్యాయపరంగా అప్రోచ్ అవ్వాలని కేబినెట్ తీర్మానించిందని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు తెలిపారు.
అలాగే, రోగుల వైద్య అవసరాలను తీర్చడానికి సనత్నగర్, ఎల్బీ నగర్, అల్వాల్లలో నిర్మిస్తున్న ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్’ (TIMS), వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం వివిధ విభాగాల్లో 6,278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇ
లాంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ నుండి 21 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్న ‘మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ మొదటి దశ కోసం రూ. 7,345 కోట్లను కూడా మంత్రివర్గం మంజూరు చేసింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు మూసీ నదికి ఇరువైపులా అనుసంధాన రహదారులను (link roads) నిర్మించాలని కూడా యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం, రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలాల్లో వరుసగా 50 ఎకరాలు, 10 ఎకరాల విస్తీర్ణంలో రెండు వ్యవసాయ గోదాముల నిర్మాణానికి కూడా అనుమతి మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్దాయిపల్లిలో 20 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలోని కోదాడలో 10 ఎకరాల విస్తీర్ణంలో కొత్త జవహర్ నవోదయ కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు; వీటి కోసం మంత్రివర్గం భూమిని కేటాయించింది. దీంతో పాటు, జగిత్యాలలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఒక కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు; దీనికి కూడా మంత్రివర్గం భూమి కేటాయింపును ఆమోదించింది.

