హైదరాబాద్: మానవ అక్రమ రవాణా వ్యతిరేక ప్రపంచ దినోత్సవం సందర్భంగా… వెట్టిచాకిరి వ్యవస్థ నిర్మూలన చట్టం 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని…నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ న్యాయ మిషన్ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, మానవ అక్రమ రవాణా, చట్టపరమైన హక్కులు, ఫిర్యాదు చేసే విధానాలపై క్షేత్రస్థాయి ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించనున్న ‘స్వేచా రథం’ అనే మొబైల్ వ్యాన్ను ప్రభుత్వం జెండా ఊపి ప్రారంభించింది.
వెట్టిచాకిరి, ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించడానికి ‘తెలంగాణ రైజింగ్’ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ సదస్సుకు 380 మందికి పైగా బాధితులు హాజరయ్యారు. ఇందులో వెట్టిచాకిరి నుండి విముక్తి పొంది… సర్పంచ్గా ఎన్నికైన లింగమ్మ హృదయవిదారక ప్రసంగంతో పాటు, బానిసత్వం నుండి స్వేచ్ఛ వైపు సాగిన ప్రయాణాన్ని వివరిస్తూ ఒక సాంస్కృతిక నాటకాన్ని ప్రదర్శించారు. విస్తృత ప్రచారం కోసం, గేయ రచయిత పల్లె నరసింహ రచించిన ఒక అవగాహన గీతాన్ని, బీఎల్ఎస్ఏ చట్టం 50 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక స్మారక పుస్తకాన్ని, దేశవ్యాప్త ప్రభుత్వ పంపిణీ కోసం అధికారిక హెల్ప్లైన్ పోస్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి పంచాక్షరి మాట్లాడుతూ… వెట్టిచాకిరి అనేది మానవ గౌరవానికి సంబంధించిన ఒక ప్రాథమిక సమస్య అని, దీనికి బహుళ శాఖల సమన్వయం అవసరమని స్పష్టం చేసారు. సహాయక చర్యలకు దీర్ఘకాలిక పునరావాసం, స్థిరమైన జీవనోపాధులు తప్పనిసరిగా తోడుగా ఉండాలని నల్సార్ వైస్-ఛాన్సలర్ కృష్ణదేవరావు చెప్పారు. ఐజేఎం జాతీయ ప్రోగ్రామ్ డైరెక్టర్ మెర్లిన్ ఫ్రీడా మాట్లాడుతూ… ఐదు దశాబ్దాల చట్టం ఉన్నప్పటికీ, రాతి క్వారీలు, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులలో అమాయక కార్మికులు ఇప్పటికీ తీవ్రమైన దోపిడీని ఎదుర్కొంటున్నారని సభికులకు గుర్తు చేశారు.


