గౌహతి: భారీ వర్షాలు, వరదల ధాటికి అస్సాం అల్లకల్లోలమైంది. ఇప్పటికే మృతుల సంఖ్య 78కి చేరింది. మూడు లక్షలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) ప్రకారం, గత 24 గంటల్లో శివసాగర్లో ఇద్దరు, గోలాఘాట్లో ఒకరు చొప్పున మరో ముగ్గురు మరణించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,00,031 మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. 1,37,561 మంది ప్రభావితం కావడంతో ‘చరైడియో’ జిల్లా అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతంగా నిలిచింది; ఆ తర్వాతి స్థానాల్లో శివసాగర్ (84,600), జోర్హాట్ (49,911) ఉన్నాయి. 16,500 మందికి పైగా నిరాశ్రయులు 71 సహాయక శిబిరాల్లో తలదాచుకోగా, మరో 72,000 మంది 30 సహాయక పంపిణీ కేంద్రాల ద్వారా సాయం పొందుతున్నారు.
వర్షాలు తాత్కాలికంగా తగ్గడంతో అప్పర్ అస్సాంలోని చాలా ప్రాంతాల్లో నీటి మట్టాలు తగ్గినప్పటికీ, అనేక గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. వరద నీరు 21,523.08 హెక్టార్ల వ్యవసాయ భూమిని ముంచెత్తింది. 11వేలకు పైగా పశువులు వరద నీటిలో కొట్టుకుపోగా, మరో 17వేల పశువులు ప్రభావితమయ్యాయి. గట్లు, రోడ్లు, పాఠశాలలు, ఇళ్లు, ఇతర ప్రజా మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి.
జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు అస్సాం, దానిని ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. టిన్సుకియా జిల్లాకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసారు; అలాగే నాగాలాండ్లోని కొన్ని జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి, వీటి ప్రభావం చరైడియో, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్ వంటి పొరుగున ఉన్న అస్సాం జిల్లాలపై పడే అవకాశం ఉంది. ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలను పాటించాలని అధికారులు కోరారు.
పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో మాట్లాడారు. సహాయక, పునరుద్ధరణ చర్యల కోసం పూర్తి కేంద్ర సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు దెబ్బతినడం లేదా బురద, ఒండ్రు మట్టితో నిండిపోవడం వల్ల చాలా మంది స్థానికులు ఇంకా తమ ఇళ్లకు తిరిగి రాలేకపోతున్నారని శర్మ పేర్కొన్నారు.
మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ₹5 లక్షల పరిహారాన్ని ప్రకటించింది, దీంతో మొత్తం ఎక్స్-గ్రేషియా (పరిహారం) ₹9 లక్షలకు చేరింది. గల్లంతైన వారి కుటుంబాలకు కూడా ఇదే మొత్తాన్ని అందిస్తారు, అయితే ఒక నెలలోపు మృతదేహాలు లభించని పక్షంలోనే ఈ పరిహారం వర్తిస్తుంది. శివసాగర్, చరైడియో, జోర్హాట్ మరియు గోలాఘాట్ జిల్లాల్లో తీవ్రంగా ప్రభావితమైన సుమారు లక్ష కుటుంబాలకు ₹15,000 చొప్పున తాత్కాలిక ఆర్థిక సహాయం మంజూరు చేసారు.; దీనికి అదనంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మరిన్ని సహాయక చర్యలు చేపడుతున్నారు. వైద్య, పశువైద్య బృందాలతో సహా పలు సంస్థలు సహాయక, పునరావాస చర్యలను కొనసాగిస్తున్నాయి.
