న్యూయార్క్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న మారణహోమంలో…భారత ఆయుధాలను ఉపయోగించే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ, మనదేశం ఇజ్రాయెల్కు ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉందని జూన్ 30న విడుదల చేసిన ఒక కొత్త నివేదికలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది.
‘మేడ్ ఇన్ ఇండియా: ఇజ్రాయెల్కు ఆయుధాలు-మందుగుండు సామగ్రి సరఫరా’ అనే శీర్షికతో ఉన్న ఈ నివేదిక, ఇజ్రాయెల్ సైన్యానికి ఆయుధాలు సరఫరా చేసే పెద్ద ఇజ్రాయెల్ కంపెనీలకు భారతీయ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విడిభాగాలు, ఇతర పరికరాలు రవాణా అవుతున్నాయని తెలిపింది.
ఈమేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లమార్డ్ మాట్లాడుతూ… “సంవత్సరాలుగా ప్రపంచానికి కనిపిస్తున్న గాజా మారణహోమం జరుగుతున్నప్పటికీ, భారతదేశం ఇజ్రాయెల్ సైనిక,రక్షణ రంగానికి మద్దతు ఇస్తూనే ఉందని మా పరిశోధన వెల్లడించిందని ఆయన అన్నారు.
గాజాలోని పాలస్తీనియన్లపై జాతి నిర్మూలన జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం తాత్కాలిక చర్యల ఉత్తర్వుల ద్వారా గుర్తించిన నేపథ్యంలో, ఇజ్రాయెల్కు ఆయుధాల బదిలీలను అనుమతించడం, సులభతరం చేయడం కొనసాగించడం వల్ల అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘనలకు దారితీసే ప్రమాదం ఉందని తమకు తెలియదని భారత అధికారులు దాటవేసే అవకాశం లేదు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పరిశోధకులు అక్టోబర్ 7, 2023 నుండి భారతదేశం నుండి ఇజ్రాయెల్కు రవాణా చేసిన దాదాపు 2,596 ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విడిభాగాలు, పరికరాల సరుకులను విశ్లేషించారు.
రికార్డుల ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యానికి ప్రత్యక్ష సరఫరాదారులుగా ఉన్న పెద్ద ఇజ్రాయెల్ కంపెనీలకు… భారతీయ కంపెనీలు కనీసం 3,90,516 సైనిక శ్రేణి ఆయుధాల చిన్న ఆయుధ విడిభాగాలు, పేలుడు పదార్థాల విడిభాగాలు 5,64,970 (డ్రోన్ వార్హెడ్లు, ఫిరంగి గుండ్ల కేసింగ్లు వంటివి), 298 సైనిక వాహన విడిభాగాలను సరఫరా చేశాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ రంగ సంస్థలలో, అధ్యయన కాలంలో మునిషన్స్ ఇండియా, అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ల ఉత్పత్తులు ఇజ్రాయెల్ రక్షణ సరఫరా గొలుసులలోకి ప్రవేశించాయని ఆమ్నెస్టీ గుర్తించింది. ఈ కంపెనీలు పూర్తిగా భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. 2021లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇవి ఏర్పాటయ్యయి.
కాగా, ఈఏడాది జూన్ – జూలై లో, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వానికి, పేర్కొన్న తొమ్మిది కంపెనీలకు లేఖలు రాసి, తమ నివేదికలోని వివరాలను వారికి తెలియజేసింది. ఆ నివేదిక ప్రచురణ సమయానికి, వారి నుండి ఎటువంటి స్పందన రాలేదు.
భారత్-ఇజ్రాయెల్ మధ్య బలమైన సంబంధాలు
దశాబ్దాలుగా, ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక పరికరాల దిగుమతిదారులలో ఒక దేశంగా భారత్ నిలిచింది. ఇజ్రాయెల్ దీనికి ప్రధాన సరఫరాదారులలో ఒకటిగా ఉంది; ముఖ్యంగా పాకిస్థాన్తో జరిగిన 1999 కార్గిల్ యుద్ధం తర్వాత, భారత్ ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణులు, ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాల (precision-guided munitions) వైపు ఎక్కువగా మొగ్గు చూపింది.
స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) ప్రకారం, 2020, 2025 మధ్యకాలంలో భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాలలో 15 శాతం ఇజ్రాయెల్ నుండే వచ్చాయి (రష్యా 40 శాతం, ఫ్రాన్స్ 29 శాతంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి).
సైనిక, పారిశ్రామిక, సాంకేతిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో, రక్షణ సహకారంపై భారత్, ఇజ్రాయెల్ 2025లో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకాలు చేశాయి.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన మారణహోమ యుద్ధంలో జరిగిన నేరాలకు సంబంధించి, 2024 చివరలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటికీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆయనను తరచుగా “ప్రియమైన మిత్రుడు” అని అభివర్ణించారు.

