వాషింగ్టన్: ఇరాన్పై తమ సైనిక చర్యను కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఐదు నెలల నిరంతర దాడులతో టెహ్రాన్ “నాశనమైందని” పేర్కొంటూ, అణ్వాయుధాన్ని సంపాదించడానికి దానిని ఎప్పటికీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు.
క్యాంప్ డేవిడ్లో జరిగిన మొదటి టెలివిజన్ ప్రసారిత క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ… ఇరాన్ తన నౌకాదళం, వైమానిక దళం, వాయు రక్షణ సామర్థ్యాలలో చాలా వరకు కోల్పోయిందని, అయినప్పటికీ కొంత పరిమిత సైనిక బలాన్ని నిలుపుకుందని ట్రంప్ అన్నారు.
“వారు నాశనమవుతున్నారు. వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, విమాన నిరోధక వ్యవస్థ లేదు. అంతమాత్రాన వారికి ఎలాంటి సామర్థ్యాలు లేవని కాదు — కొన్ని ఉన్నాయి, కానీ చాలా తక్కువని” ట్రంప్ అన్నారు.
ఇటీవలి దాడుల తర్వాత వాషింగ్టన్ కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తుందా అని అడగ్గా, ట్రంప్, “మేము కేవలం గెలవాలనుకుంటున్నాము,” అని బదులిచ్చారు. రాబోయే వారాల్లో అమెరికా ఇరాన్పై “చాలా తీవ్రంగా” దాడులు కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. నిరంతర అమెరికా బాంబు దాడులను ఇకపై తట్టుకోలేమని టెహ్రాన్ చివరికి నిర్ధారణకు వస్తుందని ఆయన అంచనా వేశారు.
ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా నిరోధించడమే వాషింగ్టన్ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పునరుద్ఘాటించారు. “ఇరాన్కు అణ్వాయుధం ఉండదు. ఒకవేళ ఉంటే, మధ్యప్రాచ్యం నాశనమైపోయేది,” అని ఆయన అన్నారు.
ఇరాన్ దురుద్దేశంతో చర్చలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు. ఇరాన్ అధికారులు “అబద్ధాలు చెబుతారు” కాబట్టి వారిపై తనకు నమ్మకం పోయిందని అన్నారు. అయినప్పటికీ, వాషింగ్టన్తో ఒప్పందం కోసం టెహ్రాన్ ప్రయత్నిస్తూనే ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలతో సహా సీనియర్ అధికారులు ఇరాన్కు సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్నారని ట్రంప్ చెప్పారు. చర్చల వేగాన్ని ఆయన విమర్శిస్తూ, ఇరాన్ ఈ విషయాన్ని నిమిషాల్లో పరిష్కరించగలదని, కానీ దానికి బదులుగా చర్చలను గంటల తరబడి పొడిగించిందని అన్నారు.
ఇరాన్ సైబర్దాడి ఆరోపణను ట్రంప్ తోసిపుచ్చారు
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో జరిగినట్లుగా చెబుతున్న సైబర్దాడి వెనుక ఇరాన్ ఉందన్న ఆరోపణలను కూడా ట్రంప్ తిరస్కరించారు. “మిన్నెసోటాలో ఒక సైబర్దాడి జరిగిందని, దానికి ఇరాన్ను నిందిస్తున్నారని మేము విన్నాము. నేను అలా అనుకోవడం లేదు,” అని ఆయన అన్నారు. “మిన్నెసోటా గురించి ఆందోళన చెందడం కంటే ఇరాన్కు ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయని ట్రంప్ అన్నారు.”
అమెరికా ఒత్తిడి కొనసాగుతుంది
ఇరాన్పై వాషింగ్టన్ సైనిక, ఆర్థిక ఒత్తిడి కొనసాగుతుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ ఆస్తులను అమెరికా వెంబడిస్తూనే ఉంటుందని, స్వాధీనం చేసుకున్న నిధులు అంతిమంగా ఇరాన్ ప్రజలకు, ఇరాన్ వల్ల నష్టపోయిన వారికి పరిహారం కోరేవారికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు.
ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా నిరోధించడానికి వాషింగ్టన్ కట్టుబడి ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పునరుద్ఘాటించారు, అదే సమయంలో కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలను ప్రశంసించారు.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఒక “చట్టవిరుద్ధమైన సంస్థ” అని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అభివర్ణించారు. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఆయన స్వాగతించారు. ఇది గణనీయమైన పురోగతిని సూచిస్తుందని, అయితే సాధించిన విజయాలను నిలబెట్టుకోవడానికి ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని ఆయన అంగీకరించారు.
హర్ముజ్ జలసంధి మూసివేత
ఈ ప్రాంతంలో అమెరికా దళాలు కొనసాగిస్తున్న “దురాక్రమణ చర్యల” కారణంగా హర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిపివేసామని ఇరాన్ పేర్కొంది. ఐఆర్జిసి అనుబంధ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం…శాంతియుత పరిస్థితులు నెలకొన్న తర్వాత షిప్పింగ్ అభ్యర్థనలను సమీక్షించి, క్రమంగా అనుమతులు జారీ చేస్తామని ఇరాన్ పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ తెలిపింది.
ఈ అంతరాయం ప్రపంచ చమురు మార్కెట్లను ప్రభావితం చేస్తూనే ఉంది. వ్యూహాత్మక జలమార్గం గుండా ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్న రెండు నౌకలను అడ్డుకున్నట్లు ఇరాన్ ప్రకటించిన తర్వాత, బ్రెంట్ క్రూడ్ సుమారు 1.3 శాతం పెరిగి బ్యారెల్కు 90.17 డాలర్లకు చేరుకుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రెండు ట్యాంకర్లను నిలిపివేసి, మరో నాలుగు ట్యాంకర్లను తమ మార్గం మార్చుకునేలా బలవంతం చేసిందని కూడా ఫార్స్ నివేదించింది.
డ్రోన్ దాడిని ఖండించిన యూఏఈ, కువైట్
కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మళ్లీ జరిపిన డ్రోన్ దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. ఇది దేశ సార్వభౌమాధికారాన్ని “స్పష్టంగా ఉల్లంఘించడమే”నని అభివర్ణిస్తూ, ప్రాంతీయ భద్రత, స్థిరత్వానికి ముప్పు అని హెచ్చరించింది.
కువైట్ కూడా ఈ దాడిని ఖండించింది. ఈ దాడిని ఒక ప్రమాదకరమైన ఉద్రిక్తతగా, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, తన సార్వభౌమత్వాన్ని, పౌరులను కాపాడుకునే కువైట్ హక్కును పునరుద్ఘాటించే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817 ఉల్లంఘనగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది.
తీవ్రమైన ప్రతీకారానికి ఇరాన్ పిలుపు
భవిష్యత్తులో ఇరాన్పై జరిగే ఏ దాడినైనా బహుళ క్షిపణి దాడులతో ఎదుర్కోవాలని ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని ఇరాన్ సర్వోన్నత నాయకుడి ప్రతినిధి మొహమ్మద్ నబీ మౌసవి ఫార్డ్ అన్నారు. అహ్వాజ్లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మాట్లాడుతూ, ఇరాన్పై ప్రయోగించే ప్రతి క్షిపణికి ప్రతిస్పందనగా అనేక క్షిపణులతో సమాధానం ఇవ్వాలని ఆయన అన్నారు.
సంయమనం పాటించాలని భారత్ విజ్ఞప్తి
కొనసాగుతున్న ఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీతో టెలిఫోన్లో మాట్లాడినట్లు భారత్ తెలిపింది. వాణిజ్య నౌకలు, నావికులపై దాడులను అన్ని పరిస్థితుల్లోనూ నివారించాలని జైశంకర్ కోరారు. ఇటువంటి దాడులను భారత్ ఖండిస్తోందని పునరుద్ఘాటిస్తూ, చర్చలు, దౌత్యం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
చర్చలు కొనసాగుతున్నాయన్న పాకిస్థాన్
ఇరుదేశాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయని పాకిస్థాన్ తెలిపింది. హర్ముజ్ జలసంధి, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించే విస్తృత ప్రయత్నాలపైనే చర్చలు కేంద్రీకృతమై ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ అన్నారు.

