న్యూఢిల్లీ: ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ఆమోదింపజేసుకునే ప్రయత్నంలో 54 మంది ఎంపీల కొరత ఎదురైన తర్వాత, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ…ఈ వర్షాకాల సమావేశాల్లో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు పావులు కదుపుతోంది.
ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం లోక్సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉంటారు. వీరిలో రాష్ట్రాల నుంచి 530 మంది వరకు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 మంది వరకు సభ్యులు ఉంటారు. కాగా, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు…ఎంపీల సంఖ్యను 850కి పెంచింది. ఇందులో రాష్ట్రాల నుంచి 815 మంది వరకు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది వరకు సభ్యులు ఉంటారు.
మూడు నెలల క్రితం, బిల్లు 54 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు, లోక్సభలో చట్టాన్ని ఆమోదింపజేయడానికి అవసరమైన 2/3వ వంతు మెజారిటీని నరేంద్ర మోదీ ప్రభుత్వం పొందకుండా చూసేందుకు, ఇండియా కూటమిలో బలమైన ఐక్యతా భావం నెలకొని ఉంది.
అయితే, అప్పటి నుండి రాజకీయ వాతావరణం గణనీయంగా మారిపోయింది. ఇండియా కూటమిలో ఏర్పడిన చీలికలు, ఎన్నికల ఓటముల తర్వాత డీఎంకే, టీఎంసీ వంటి కీలక ప్రాంతీయ పార్టీలు బలహీనపడటం, ప్రతిపక్ష పార్టీలలో మారుతున్న సమీకరణాలు, గతంలో లేని సంఖ్యాబలాన్ని ఇప్పుడు ప్రభుత్వం సాధించడానికి ఒక వాస్తవిక మార్గాన్ని ఏర్పరుచుకుందనే ఊహాగానాలకు ఆజ్యం పోశాయి.
కాగా, డీలిమిటేషన్ బిల్లు విషయంలో బీజేపీతో జరుగుతున్న పోరాటంలో కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇండియా బ్లాక్లోని దాని మిత్రపక్షాలు మిశ్రమ సంకేతాలు ఇస్తుండటంతో, వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందుతుందనే భావన కలుగుతోంది.
అటు ఇండియా కూటమి ఐక్యంగా లేదు. ఇది ఒకే రకమైన భావాలు గల పార్టీల సమైక్య సమూహం కాదు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో వారంతా ఏకమయ్యారు. లేకపోతే, ఇండియా కూటమి ఈ స్వల్ప కాలంలో వివిధ భాగస్వాములు ఒకరికొకరు వ్యతిరేకంగా ఎలా పనిచేశారో మనందరికి తెలిసిన విషయమే.
ఉదాహరణకు, తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ, డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డీఎంకేను వదిలేసి విజయ్ తమిళగ వెట్రి కజగంతో చేతులు కలిపింది. కాబట్టి, ఒక నిర్దిష్టమైన లక్ష్యం కొరవడింది. కనబడుతున్న ఉమ్మడి కార్యక్రమం ఏదీ లేదు. ఇది ఎన్నో పరస్పర విరుద్ధ సంకేతాలకు దారితీస్తోంది. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ ఏకాకి అయింది.
‘ఇండియా’ కూటమిలో మమతకు ఎప్పుడూ ఆమ్ ఆద్మీ పార్టీ, అఖిలేష్ యాదవ్లతో ఒక ఉప-వర్గం లాంటి సంబంధం ఉండేది. వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే, తమతమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ వచ్చారు. దీనికి భిన్నంగా, NDA కూటమిని చూస్తే, వారిలో ఒక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తుంది, వారు ఒకే రకమైన భావజాలంతో నడుస్తుంటారు.
ఏది ఏమైనప్పటికీ, డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి NDAకు 54 మంది ఎంపీలు కావాలి. ఈసారి TMC నుండి విడిపోయిన వర్గం, DMK పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాయని అనుకున్నా… ప్రభుత్వానికి ఇంకా 5 నుండి 10 మంది ఎంపీల కొరత ఉంటుంది. అయితే ప్రతిపక్షం నుండి మరో 6 నుండి 10 మంది ఎంపీలను ప్రభుత్వ పక్షానికి చేర్చుకోవడం అసాధారణమేమీ కాదు, అలాగే కష్టమైన పని కూడా కాదు. ఫలితంగా డీలిమిటేషన్ బిల్లుకు చట్టబద్ధత రావడం ఖాయంగా కనిపిస్తోంది.
