ఇంఫాల్: మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలో ఉన్న ఒక కొండ ప్రాంత గ్రామంపై అనుమానిత మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు పౌరులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. జాతి ఘర్షణలు మొదలై మూడేళ్లు దాటిన తర్వాత కూడా రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా హింసాత్మక ఘటన ఇది.
కుకీ-మెజారిటీ జిల్లా అయిన కాంగ్పోక్పిలోని టి. వైచోంగ్ సబ్-డివిజన్ పరిధిలో ఉన్న ఎన్. టెయిఖంగ్ గ్రామంపై అత్యాధునిక ఆయుధాలు కలిగిన మిలిటెంట్లు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో దాడి చేశారని అధికారులు పేర్కొన్నారు. దాడి చేసిన వారు పలు ఇళ్లకు నిప్పు పెట్టారని, అలాగే మరో వర్గానికి చెందిన సాయుధ బృందాలతో తీవ్రస్థాయిలో కాల్పులకు దిగారని వారు తెలిపారు.
మరణించిన వారిని టింగ్నెయిచిన్ లౌవుమ్ (40), హోయ్నెనెంగ్ లౌజెమ్ (21), లామ్టిన్థాంగ్ లౌజెమ్ (35)గా గుర్తించారు. గాయపడిన వారిని నెమ్నెయిచోంగ్ లౌజెమ్ (50), సెయిలున్ లౌజెమ్ (70), డెయిల్హింగ్ హాకిప్ (55), కామ్టిన్సెయ్ చోంగ్లోయ్ (38)గా గుర్తించారు.
మణిపూర్లో భద్రతా పరిస్థితి అస్తవ్యస్థంగా ఉన్న తరుణంలో ఈ దాడి జరిగింది. మే 2023 నుండి లోయ ప్రాంతంలో ఆధిపత్యం కలిగిన మైతేయి వర్గం, కుకీ-జో గిరిజన సమూహాల మధ్య జరిగిన ఘర్షణల్లో 250 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పుడప్పుడు ప్రశాంతత నెలకొన్నప్పటికీ, భద్రతా దళాలు పదేపదే ఆపరేషన్లు చేపట్టినప్పటికీ, రెండు వర్గాల ప్రాంతాలను వేరుచేసే సరిహద్దుల్లో అడపాదడపా కాల్పులు, నిప్పుపెట్టే ఘటనలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
కుకీ-జో మెజారిటీ జిల్లా అయిన కాంగ్పోక్పి ఈ ఘర్షణల సమయంలో కీలక ఉద్రిక్త ప్రాంతంగా (flashpoint) నిలిచింది. ముఖ్యంగా మైతేయి ఆధిపత్యం ఉన్న ప్రాంతాలకు ఆనుకుని ఉన్న మార్గాలు, ప్రాంతాలలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
కాగా, నిన్న జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, కాంగ్పోక్పికి చెందిన ‘కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ’ (COTU) సెప్టెంబర్ 1న ఉదయం 5 గంటల నుండి జాతీయ రహదారి-2 (ఇంఫాల్-దిమాపూర్ మార్గం)పై 24 గంటల పాటు సంపూర్ణ బంద్ను ప్రకటించింది. “అయితే, విద్యాసంస్థలు, వైద్య, అగ్నిమాపక సేవలు, బ్యాంకింగ్, విద్యుత్ శాఖలకు ఈ షట్డౌన్ (బంధ్) నుండి మినహాయింపు ఉంది” అని COTU ఒక ప్రకటనలో తెలిపింది.
ట్విలాంగ్ ప్రాంతానికి చెందిన కుకీ పౌర సమాజ సంస్థల కార్యవర్గ కమిటీ కూడా ఈ హత్యలను ఖండించింది, వీటిని “ఎటువంటి రెచ్చగొట్టే చర్య లేకుండా జరిగిన అనాగరిక దాడి”గా అభివర్ణించింది.
“క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేటప్పుడు వారికి సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించేందుకు అధికారులు వెంటనే తగినంత మంది సిబ్బందిని మోహరించాలి” అని ఆ సంస్థ పేర్కొంది.
ఈ దాడి తర్వాత ఆ ప్రాంతంలో భద్రతా దళాలను మోహరించారు; దాడికి పాల్పడిన వారి వివరాలు, కాల్పుల ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమీక్షిస్తున్నారు.

