ఇంఫాల్: మణిపూర్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఆరుగురు నాగా యువకుల అపహరించి హత్యచేసారన్న ఆరోపణలపై విధుల్లో ఉన్న కుకీ వర్గానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. కాగా, సస్పెండ్ అయిన కానిస్టేబుల్ లోయలోని బిష్ణుపూర్ పోలీసులతో ఉండేవాడు, కానీ ఘర్షణల కారణంగా కొండ ప్రాంతంలోని కాంగ్పోక్పి హిల్ జిల్లాకు బదిలీ అయ్యాడు.
ఈ కేసులో కానిస్టేబుల్ ప్రమేయం ఉందనే ఆరోపణలపై పోలీసులు జూలై 6 నుంచే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు నిర్వహణ విషయంలో మణిపూర్లోని నాగా, కుకీ రాజకీయ నాయకుల మధ్య విభేదాలు పెరగడంతో ఈ చర్య తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి లోసీ డిఖోతో సహా నాగా శాసనసభ్యులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, ఈ హింసాకాండలో మరో ఉప ముఖ్యమంత్రి నెమ్చా కిప్జెన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. కిప్జెన్పై వచ్చిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు.
నాగా ఎమ్మెల్యేలు కిప్జెన్తో కలిసి అసెంబ్లీ గదిని షేర్ చేసుకోవడానికి కూడా నిరాకరించి, సభా కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కాగా, మే 13న నాగ-కుకీ ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో అపహరణకు గురైన వారిలో ఈ ఆరుగురు నాగా యువకులు కూడా ఉన్నారు. కాంగ్పోక్పిలో జరిగిన ఒక దాడిలో ముగ్గురు కుకీ చర్చి నాయకులు నాగ వర్గాల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత జరిగిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇరు వర్గాల సాయుధ బృందాలు ఈ అపహరణలకు పాల్పడ్డాయి.
చర్చి నాయకులు, ప్రభుత్వ అధికారులు కుదిర్చిన బందీల మార్పిడి అనంతరం మే 15న ప్రత్యర్థి వర్గాల చేతిలో బందీలుగా ఉన్న మహిళలు, పిల్లలు విడుదలయ్యారు. అయితే, 14 మంది కుకీ-జో పురుషులు, ఆరుగురు నాగాలు ఇంకా బందీలుగానే ఉన్నారు.
చర్చి నాయకులు, భద్రతా దళాలు, సైన్యం, ఇంటెలిజెన్స్ బ్యూరో జోక్యం తర్వాత 14 మంది కుకీ-జో పురుషులు విడుదలయ్యారు. ఆరుగురు నాగా పురుషులు తిరిగి రాలేదు. వారిని బందీలుగా ఉంచినట్లు కుకీ-జో బృందాలు ఖండించాయి, కానీ వారి అపహరణ జరిగిన సుమారు నెల రోజుల తర్వాత, జూన్ 10న కాంగ్పోక్పి జిల్లాలోని అడవుల నుండి వారి ఛిద్రమైన మృతదేహాలు లభ్యమయ్యాయి. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసును విచారిస్తోంది.
కాగా, ఛిద్రమైన స్థితిలో లభ్యమైన ఆరుగురు నాగా పురుషుల మృతదేహాలను ఖననం చేయడానికి వారి కుటుంబాలు నిరాకరించాయి. నాగా, కుకీ రాజకీయ ప్రతినిధుల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో కానిస్టేబుల్పై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసు రెండు వర్గాల మధ్య ప్రధాన వివాదాంశంగా మారింది. సస్పెన్షన్, శాఖాపరమైన విచారణ మాత్రమే అపహరణ లేదా హత్యలలో కానిస్టేబుల్ ప్రమేయాన్ని నిర్ధారించవు. ఆరోపణలు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి.


