అమరావతి/ఆంధ్రప్రదేశ్ : ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని ‘పోరస్’ రసాయన పరిశ్రమలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్లో మంటలు చెలరేగి.. రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగినప్పుడు 18 మంది బాధితులు ఫార్మాస్యూటికల్ ప్లాంట్లోని యూనిట్ 4లో పనిచేస్తున్నారు. మృతుల్లో నలుగురు బిహార్వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది.
పరిశ్రమ ముందు ఆందోళనలు.. అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమ ముందు.. పరిశ్రమ సిబ్బంది, స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా.. పరిశ్రమ ముందు బైఠాయించారు.
గ్రామం నుంచి కంపెనీని తరలించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఘటనాస్థలిని నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. అనంతరం గ్రామస్థులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనటంతో.. పోలీసులు బందోబస్తు చేపట్టారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి; 25లక్షల ఎక్స్గ్రేషియా!
ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై.. సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు.. ముఖ్యమంత్రి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు.