హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా చెక్పోస్టులను వెంటనే మూసివేయాలని తెలంగాణ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జీఎస్టీ అమలు తర్వాత చెక్పోస్టుల అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వాహనాల ప్రయాణంలో, సరకుల రవాణాలో ఆలస్యాన్ని తగ్గించి సజావుగా రవాణా సాగేందుకు వీలవుతుంది.
ఈమేరకు డిప్యూటీ రవాణా కమిషనర్లు, జిల్లా రవాణా అధికారులు తమ కార్యకలాపాలను వెంటనే నిలిపివేసి, సాయంత్రం ఐదు గంటలలోపు మూసివేత నివేదికను సమర్పించాలని కోరారు.
చెక్పోస్టు నుండి అన్ని బోర్డులు, బారికేడ్లను తొలగించి, మూసివేతను ప్రకటించే కొత్త బోర్డులను ప్రదర్శించాలని, అలాగే డ్రైవర్లకు అందుబాటులో ఉన్న ఆన్లైన్ సేవల వివరాలను కూడా ప్రదర్శించాలని వారిని కోరారు.
అదనంగా, ప్రస్తుతం ఈ చెక్పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని ఆలస్యం లేకుండా ఇతర విధులకు కేటాయించాలి. వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఈ చెక్పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన అన్ని భౌతిక అడ్డంకులు, బారికేడ్లు, సంకేతాలను తొలగించాలని ఆదేశించారు.
కాగా చెక్పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, కంప్యూటర్లు, ఫర్నీచర్, ఇతర పరికరాలను ఆయా జిల్లా రవాణా కార్యాలయాలకు తరలించాలని కమిషనర్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఏ రికార్డు కూడా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సక్రమంగా భద్రపరచి భవిష్యత్ తనిఖీలకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. చెక్పోస్టుల మూసివేత పూర్తయిన వెంటనే, సంబంధిత అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలని కమిషనర్ తెలిపారు.


