హైదరాబాద్: నిన్న కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం… తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో, ఇదే ఊపు మీద స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించారు.
డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రజా పాలన వారోత్సవాన్ని నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించిందని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ వారోత్సవాల్లో కొత్త సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం.. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి ముఖ్యమైన పనులు ఉంటాయి. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే.. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ఒకేసారి కాకుండా దశలవారీగా నిర్వహించాలని భావిస్తున్నారు. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నోటిఫికేషన్లు ఇస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 9న బీసీల 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై మధ్యంతర స్టే జారీ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాన్ని అనుసరించి, ఎన్నికల నోటిఫికేషన్లు రద్దు చేశారు. మొత్తానికి డిసెంబర్లో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవకాశం కనిపిస్తుంది. మార్చి 31లోపు పంచాయతీ ఎన్నికలు పూర్తి అయితే కేంద్ర ఆర్థికసంఘం నుంచి నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది.


