న్యూఢిల్లీ: వివిధ మైలురాయి తీర్పులలో భాగమైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సూర్యకాంత్తో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అంతేకాదు తొలిసారిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల అంతర్జాతీయ బృందం హాజరవడం గమనార్హం.
కాగా, జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో నియమితులైన జస్టిస్ కాంత్ దాదాపు 15 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. సుప్రీంకోర్టులో తన సుదీర్ఘ పదవీకాలంలో ఆయన అనేక ముఖ్యమైన, కీలక తీర్పులు ఇచ్చారు.
హర్యానాలోని హిస్సార్లో మధ్యతరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 1981లో హిస్సార్లోని ప్రభుత్వ పిజి కాలేజి నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
1984లో హిస్సార్లోని జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2000లో హర్యానాకు అతిపిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్ అయ్యారు. 2011లో కురుక్షేత్ర యూనివర్శిటీ నుండి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీలో మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన ఆయన.. 2019లో సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్,రాష్ట్రపతి అధికారాలపై ఇటీవల రాష్ట్రపతి సూచనతో సహా కీలక తీర్పులలో భాగమయ్యారు. వలసరాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని నిలిపివేసిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు, ప్రభుత్వ సమీక్ష జరిగే వరకు దాని కింద కొత్త కేసులు నమోదు చేయకూడదని ఆదేశించారు.
అంతేకాదు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి వీలుగా బీహార్ ఓటర్ల జాబితా నుండి తొలగించిన 65 లక్షల మంది పేర్ల పూర్తి వివరాలను బహిరంగపరచాలని ఆయన ఎన్నికల సంఘానికి ఆదేశించడం తెలిసిందే.
చట్టవిరుద్ధంగా పదవి నుండి తొలగించిన మహిళా సర్పంచ్ను తిరిగి నియమించిన ధర్మాసనానికి కూడా ఆయన నాయకత్వం వహించారు. ఈ విషయంలో లింగ పక్షపాతాన్ని విమర్శించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని ఆదేశించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
ఇక, 1967 అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ తీర్పును కొట్టివేసిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ కాంత్ ఉన్నారు. ఇది సంస్థ మైనారిటీ హోదాను పునఃపరిశీలించడానికి మార్గం తెరిచింది.
కీలకమైన పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన,చట్టవిరుద్ధమైన నిఘా ఆరోపణలను దర్యాప్తు చేయడానికి సైబర్ నిపుణుల ప్యానెల్ను నియమించిన ధర్మాసనంలో ఆయన కూడా ఒకరు. ఇలా పలు కీలక తీర్పులలో ఆయన భాగస్వామిగా ఉన్నారు.
బాధ్యతలు స్వీకరించడానికి ముందు మీడియాతో జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ… సుప్రీంకోర్టు సహా దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులలో పెండింగ్ను తగ్గించడం తన ప్రధాన ప్రాధాన్యత అని అన్నారు


