Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్‌!

Share It:

కోల్‌కతా/చెన్నై: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, హోరాహోరీ పోరు నడుమ, పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల మొదటి దశలో భాగంగా 152 నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది.

ఎన్నికల సంఘం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌ తొలి దశలో 3.60 కోట్లకు పైగా ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. వీరిలో సుమారు 1.75 కోట్ల మంది మహిళలు, ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. వీటిలో దాదాపు 2.5 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. 8,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో భాగంగా నేడు ముర్షిదాబాద్ జిల్లాలోని డోమ్‌కల్‌లో పలువురిని ఓటు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలపై అధికారుల నుంచి ఎన్నికల సంఘం నివేదిక కోరినట్లు అధికారులు తెలిపారు.

డోమ్‌కల్‌లోని పలువురు ఓటర్లు తమను బెదిరించారని, భయపెట్టారని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తే తమపై దాడి చేస్తామని హెచ్చరించినట్లు కొందరు పేర్కొన్నారు. డోమ్‌కల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాయ్‌పూర్ గ్రామంలో, తెల్లవారుజాము నుంచి సాయుధులు ఆ ప్రాంతంలో మకాం వేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ ఆరోపణలు అధికార టీఎంసీపై చేసినప్పటికీ, ఆ పార్టీ ఈ ఆరోపణలపై వెంటనే స్పందించలేదు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతుండగా,పశ్చిమ బెంగాల్‌లోని కొన్నిచోట్ల ఈవీఎం సాంకేతిక లోపాల కారణంగా ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా అసెంబ్లీ నియోజకవర్గంలో, పర్సాలిక మదన్‌మోహన్ ప్రాథమిక పాఠశాలలోని బూత్ నంబర్ 156 వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)లో సాంకేతిక లోపం తలెత్తడంతో పోలింగ్‌ను నిలిపివేశారని వారు తెలిపారు.

శంషేర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 212 వద్ద కూడా ఇలాంటి సమస్యల కారణంగా పోలింగ్ సకాలంలో ప్రారంభం కాలేదు. కండిలోని బూత్ నంబర్ 130 వద్ద కూడా పోలింగ్ ఆలస్యమైందని అధికారులు తెలిపారు. పూర్బ మేదినీపూర్‌లో, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బిరులియాలో ఒక EVMలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.

కూచ్ బెహార్‌లో, టౌన్ హైస్కూల్‌లోని బూత్ నంబర్ 229 వద్ద పోలింగ్‌ను దాదాపు గంటసేపు నిలిపివేసి, ఆ తర్వాత పునఃప్రారంభించారు. మాల్దా జిల్లాలోని హబీబ్‌పూర్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 231 వద్ద కూడా పోలింగ్ ఆలస్యమైంది. డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురిలో, మార్గరెట్ స్కూల్‌లోని బూత్ నంబర్ 26/31 వద్ద ఒక EVMలో లోపం కారణంగా పోలింగ్ సకాలంలో ప్రారంభం కాలేదు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ఉదయం ఇప్పటి వరకు 18.76 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరోవంక తమిళనాడులోని మొత్తం 234 శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కాగా, తమిళనాడు ఓటర్ల సంఖ్య 5.73 కోట్లు. వీరు 4,023 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించడానికి 33,133 ప్రాంతాల్లోని 75,064 పోలింగ్ కేంద్రాలలో ఓటు వేయనున్నారు. మొత్తం ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

ఇదిలా ఉండగా… తమిళనాడులో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. సేలం జిల్లా సిలువంపాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలు ఈరోజు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ప్రజాస్వామ్య బాధ్యతను నెరవేర్చాలని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి అన్నారు.

ఓటింగ్ సమయాన్ని పొడిగించండి…విజయ్
తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, తిరుచిరాపల్లి తూర్పు, పెరంబూర్ నియోజకవర్గాల అభ్యర్థి విజయ్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో, పోలింగ్ సమయాన్ని రాత్రి 8 గంటల వరకు మరో రెండు గంటలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

“పోలింగ్ సమయాన్ని రెండు గంటలు పొడిగించండి: ప్రయాణ అంతరాయాల కారణంగా ఆలస్యంగా వస్తున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరగడం, అలాగే పొడవైన క్యూలలో వేచి ఉండాల్సిన అనివార్యత దృష్ట్యా, ప్రభావితమైన అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ను రాత్రి 8:00 గంటల వరకు పొడిగించాలి,” అని ఆ నటుడి లేఖలో పేర్కొన్నారు.

కాగా, తమిళనాడులోని మెట్టుపళయం అసెంబ్లీ నియోజకవర్గం, జడయంపాలయం పంచాయతీ పరిధిలోని దొడ్డబావిలో గల బూత్ నెం. 162 వద్ద, ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన దానికంటే ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఓటర్లు గురువారం దాదాపు రెండు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రెండోసారి అధికారంలోకి వస్తారనే నమ్మకం ఎంత ఉందని మీడియా కమల్ హాసన్‌ను ప్రశ్నించగా, ఆ నటుడు “అవును” అని సమాధానమిచ్చారు.

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి, కొలత్తూరు డీఎంకే అభ్యర్థి ఎంకే స్టాలిన్ తన ఓటు వేయడానికి చెన్నైలోని ఒక పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయన కుమారుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయనతో ఉన్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.