న్యూఢిల్లీ: బ్రిక్స్ (BRICS) విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమ దేశంపై జరిగిన సైనిక చర్యలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రత్యక్షంగా పాల్గొందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆరోపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. కాగా, ఇరాన్ తీరును యూఏఈ తప్పుబట్టింది.
ఇరాన్ యుద్ధ సమయంలో తాను గల్ఫ్ దేశాన్ని సందర్శించినట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటనను యూఏఈ ఖండించిన ఒక రోజు తర్వాత ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై అరాఘ్చి ఇప్పటికే స్పందిస్తూ, “విభజన సృష్టించడానికి ఇజ్రాయెల్తో కుమ్మక్కయ్యేవారిని జవాబుదారీగా చేస్తాం” అని అన్నారు.
“ఐక్యత కోసం నేను నా (బ్రిక్స్) ప్రకటనలో యూఏఈ పేరు ప్రస్తావించలేదు. కానీ వాస్తవం ఏమిటంటే, నా దేశంపై జరిగిన దురాక్రమణలో యూఏఈ ప్రత్యక్షంగా పాలుపంచుకుంది. దాడులు ప్రారంభమైనప్పుడు, వారు కనీసం ఖండన కూడా జారీ చేయలేదు,” అని యూఏఈ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అరాఘ్చి అన్నట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది.
అయితే యూఏఈ ప్రతినిధి ఏమి అన్నారో ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పష్టంగా వెల్లడించలేదు. నివేదికల ప్రకారం, అమెరికా స్థావరాలు గానీ, ఇజ్రాయెల్తో పొత్తు గానీ యూఏఈకి భద్రతను కల్పించలేవని, ఇరాన్ పట్ల తన విధానాన్ని పునఃపరిశీలించుకోవాలని అరాఘ్చి పేర్కొన్నారు. “మనం శాంతియుతంగా పక్కపక్కన జీవించాలి, దీనికి ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు, పూర్తి అవగాహన అవసరమని” అరాఘ్చి జోడించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతిస్పందనగా టెహ్రాన్, అమెరికా స్థావరాలు, గల్ఫ్ దేశాల్లోని ఇతర లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఏప్రిల్ ఆరంభంలో యూఏఈ ఇరాన్పై దాడులు చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. కాగా, సౌదీ అరేబియా కూడా ఇరాన్పై అనేక రహస్య దాడులు చేసిందని ఇరాన్ అధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటన విడుదల కావడానికి ఈ వివాదం పెద్ద అడ్డంకిగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షేమాన్ని పరిష్కరించడానికి బ్రిక్స్ సరైన వేదిక కాదని ఇరు దేశాలు వాదించడంతో, ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరాన్ యుద్ధంలో యూఏఈ ఉనికి కారణంగా “సమస్యలు” ఉన్నాయని ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాది పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

