బెంగళూరు: ఆర్ఎస్ఎస్ పనితీరు గురించి ఒక దళిత మంత్రి ఎందుకు ఆందోళన చెందాలని బీజేపీ ఎంపీ రమేష్ జిగజిణగి ప్రశ్నించిన నేపథ్యంలో, కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బి.ఆర్. అంబేద్కర్ అనుచరులు ఎవరికీ భయపడరని ఆయన స్పష్టం చేశారు.
RSS తన చట్టపరమైన హోదాను స్పష్టం చేయాలని, అలాగే తన నిధులు, ఆస్తులు,సంస్థాగత నిర్మాణం గురించిన వివరాలను వెల్లడించాలని ఖర్గే ఇటీవల చేసిన డిమాండ్ ఈ వివాదానికి మూలం. దీనిపై స్పందిస్తూ, ఒక దళిత వ్యక్తికి RSS వ్యవహారాలతో పనేముందని బీజేపీ ఎంపీ రమేష్ ప్రశ్నించారు; ఖర్గే తన మంత్రిత్వ శాఖ బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు.
దీనికి స్పందించిన ఖర్గే, ఆ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. దళిత వర్గానికి చెందినప్పటికీ RSS అంతర్గత వర్గాల్లోకి ప్రవేశం లభించకపోవడం వల్ల కలిగిన అసహనం ఆ వ్యాఖ్యల్లో ప్రతిబింబించిందా, లేక అవి ఒక హెచ్చరికగా ఉద్దేశించాయా అని ఆయన ప్రశ్నించారు.
“సామాజిక అంతస్తుల ఆధారిత వ్యవస్థను (hierarchical social order) నమ్మే RSSతో దళితులు సంబంధం పెట్టుకోవద్దని సూచించే హెచ్చరికనా ఇది?” అని కూడా ఖర్గే ప్రశ్నించారు.
సామాజిక ఆధిపత్యాన్ని నమ్మే వారి ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడిన సంస్థగా తాను అభివర్ణించిన RSSను ప్రశ్నించే హక్కు దళితులకు లేదని ఆ వ్యాఖ్యల ఉద్దేశమా అని మంత్రి సవాల్ చేశారు. అలాగే, RSS వంటి సంస్థలను రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం పరిధిలోకి తీసుకురావడానికి దళితులు అసమర్థులని బీజేపీ ఎంపీ రమేష్ వ్యాఖ్యానించారా అని కూడా ఆయన ప్రశ్నించారు.
“RSSను ఎదిరించిన వారు ఎవరూ మనుగడ సాగించలేదు” అని బీజేపీ ఎంపీ రమేష్ చేసిన వ్యాఖ్యను ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. “ఆయన RSS పట్ల భయంతో అలా అన్నారా, లేక నన్ను భయపెట్టడానికి అలా అన్నారా?” అని ఖర్గే ప్రశ్నించారు. “ఎవరూ మనుగడ సాగించలేరని ఆయన అన్నప్పుడు దాని అర్థం ఏమిటి? RSS ఒక ఉగ్రవాద సంస్థా? తనను ప్రశ్నించే వారిని అది అంతం చేస్తుందా?”
అంబేద్కర్ ఆశయాల పట్ల తనకున్న నిబద్ధత తనకు ఎవరినైనా సవాలు చేసే ధైర్యాన్ని ఇచ్చిందని మంత్రి చెప్పారు. “నేను బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని అనుసరించేవాడిని. ప్రశ్నించే ధైర్యం, నా మేధోపరమైన దృఢవిశ్వాసం ఆయన నుండే వచ్చాయి. బాబాసాహెబ్ను నమ్మే వారు భయపడరు,” అని ఖర్గే అన్నారు. తాను రాజ్యాంగం నుండి బలం పొందుతానని, రాజ్యాంగ రక్షణలు పొందుతూ రాజ్యాంగబద్ధత లేని వారికి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. “నేను బెదిరింపులకు కాదు, కేవలం నైతికత లోపానికి మాత్రమే భయపడతాను, ఎందుకంటే అంబేడ్కర్ రక్తం మా సిరల్లో ప్రవహిస్తోంది,” అని ఆయన అన్నారు.
ఈ వారం ప్రారంభంలో, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్కు, దాని చట్టపరమైన హోదాపై స్పష్టత కోరుతూ ఖర్గే లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. ఇతర ప్రభుత్వ సంస్థల నుండి ఆశించే పారదర్శకత, రాజ్యాంగ జవాబుదారీతనం ప్రమాణాలకే ఆర్ఎస్ఎస్ కూడా కట్టుబడి ఉండాలని ఆయన వాదించారు.
కాగా, విజయపురలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ బీజేపీ ఎంపీ మాట్లాడుతూ, ఒక హోం మంత్రి ఏ సమస్యలను లేవనెత్తాలో ఖర్గేకు అవగాహన లేనట్లు కనిపిస్తోందని అన్నారు. “ఆర్ఎస్ఎస్ గురించి ఇలాంటి ప్రశ్నలు అడగడం అతని పనా? ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో ప్రజలే అతనికి చెబుతారు. ఆర్ఎస్ఎస్కు అడ్డువచ్చిన వారెవరూ బ్రతకలేకపోయారు. అతను అనవసరంగా ఆర్ఎస్ఎస్ అంశాన్ని లేవనెత్తుతున్నాడని సదరు బీజేపీ ఎంపీ అన్నారు. “నా ప్రశ్న ఏమిటంటే ఈ దళిత వ్యక్తికి ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకంత ఆందోళన?”అని ఆ బీజేపీ ఎంపీ ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పలుకుబడి వల్ల ప్రియాంక ఖర్గే రాజకీయంగా లబ్ధి పొందారని కూడా బీజేపీ ఎంపీ రమేష్ సూచించారు. “అతని తండ్రి పార్టీ కోసం చాలా కష్టపడ్డారు కాబట్టి, అతనికి ఆ ఏర్పాటు జరిగింది. అతను ప్రజా సేవ ద్వారా పేరు తెచ్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ వెంట పడటం అతనికి తగదని” ఆ బీజేపీ ఎంపీ రమేష్ జిగజిణగి అన్నారు.
