Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

తెలంగాణలో ఎస్.ఐ.ఆర్: ప్రజా జాగృతి అనివార్యం!

Share It:

ముహమ్మద్ ముజాహిద్…🖋️

భారత ఎన్నికల సంఘం జూన్ 25 నుండి తెలంగాణ వ్యాప్తంగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రభుత్వ అధికారిక యంత్రాంగం ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది. జూన్ 25 నుండి బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ వెళ్లి పౌరుల సమగ్ర వివరాలను సేకరిస్తారు. ఈ ప్రత్యేక పునఃపరిశీలన ప్రక్రియ జూన్ 25 నుండి జూలై 24, 2026 వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది.

అనంతరం, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలవుతుంది. జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు ప్రజల నుండి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ జరుగుతుంది. ఓటరు అర్హతలపై ఎలాంటి సందేహాలు లేదా స్పష్టత లోపించినా, వారికి నోటీసులు జారీ చేసి పునర్విచారణ నిర్వహిస్తారు. అక్టోబర్ 1, 2026 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురితమవుతుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ ముగుస్తుంది.

ఇంతకుముందు ఏ ఏ రాష్ట్రాల్లో ఈ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ జరిగిందో, అక్కడ పారదర్శకత లోపించడం వల్ల లక్షలాది మంది పౌరుల పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయనే చేదు నిజాలు వెలుగుచూశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఇక్కడ కూడా లక్షలాది మంది ఓటర్ల పేర్లను తొలగించవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకుండా ప్రజలు అత్యంత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది.

ఈ విషయంలో జరిగే స్వల్ప నిర్లక్ష్యం లేదా అజాగ్రత్త కూడా ఊహించని రాజకీయ, సామాజిక నష్టాలకు దారితీస్తుంది. ఏ ఒక్క అర్హుడైన ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగించబడకుండా చూసుకోవడం మన కర్తవ్యం. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాలి. ముఖ్యంగా నిరక్షరాస్యులు, నిస్సహాయులకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించి సహాయం చేయాలి.నగరంలో విస్తృతంగా ప్రయత్నాలు జరిగినప్పటికీ, హైదరాబాద్‌లో ఇప్పటివరకు యాభై శాతం కంటే తక్కువ మంది ఓటర్ల మ్యాపింగ్ మాత్రమే పూర్తయింది.

ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం, తెలంగాణలో సుమారు 30 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగింపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 88 లక్షల మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. వీటిపై పునర్విచారణ జరగడం అత్యంత ఆవశ్యకం. ముందస్తు మ్యాపింగ్ ప్రక్రియలో 11 రకాల లోపాలను గుర్తించినట్లు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) వెల్లడించారు. సాంకేతిక లోపాలు ఉన్నచోట నోటీసులు జారీ చేసి, విచారణ అనంతరం నిజమైన ఓటర్ల పేర్లను పునరుద్ధరిస్తారు. అయితే, తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించక తప్పదు. ఒకవేళ ట్రిబ్యునల్ కూడా పత్రాలను తిరస్కరిస్తే, ఈ వ్యవహారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వెళ్లి, పౌరుడి పౌరసత్వానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే ప్రాథమిక దశలోనే సరైన పత్రాలతో ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకోవడం శ్రేయస్కరం.

దేశంలో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి వివిధ రాజకీయ, సామాజిక శక్తులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన శిబిరాలను, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ, ప్రజల్లో ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడం విచారకరం. ఈ ఉదాసీనతకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎస్.ఐ.ఆర్ అనేది కేవలం ఓటు వేయడానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాదు; ఇది భారతదేశంలో మీ పౌరసత్వాన్ని నిరూపించే అత్యంత కీలకమైన పత్రం. 2026 ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాని పక్షంలో, సదరు వ్యక్తి పౌరసత్వం ప్రమాదంలో పడుతుంది. రాజ్యాంగబద్ధమైన, చట్టపరమైన హక్కులను, స్వేచ్ఛను కోల్పోవడమే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కూడా వారు అనర్హులవుతారు. ప్రస్తుత దేశీయ రాజకీయ వాతావరణంలో ఓటు హక్కును కోల్పోవడం వల్ల కలిగే పర్యవసానాలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా పరిగణించాలి.ఈ ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ వెనుక బలమైన రాజకీయ ప్రయోజనాలు, నిర్దిష్ట వర్గాలను రాజ్యాంగ హక్కుల నుండి దూరం చేసే ఒక వ్యూహాత్మక కుట్ర దాగి ఉందనే విషయాన్ని తోసిపుచ్చలేము. ఈ వాస్తవాలను గ్రహించకుండా నిర్లక్ష్యం వహిస్తే మన చేతులతో మన భవిష్యత్తును నాశనం చేసుకున్నట్లే అవుతుంది.

మైనారిటీలను, దళితులను, వెనుకబడిన వర్గాలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలనే మతోన్మాద శక్తుల ఆలోచనల ఫలితమే ఈ బలవంతపు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ. ఈ శక్తులకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలంటే, పీడిత వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఓటర్ల జాబితాలో తమ పేర్లను భద్రపరుచుకోవాలి. సమయం మించిపోయాక పశ్చాత్తాపపడినా లాభం ఉండదు. అవసరమైన పత్రాలన్నింటినీ సిద్ధం చేసుకుని, లోపాలు ఉంటే ఇప్పుడే సవరించుకోవాలి. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు, కాబట్టి ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. విదేశాలలో నివసిస్తున్న భారతీయ పౌరులు కూడా దేశానికి రానవసరం లేకుండానే, తమ కుటుంబ సభ్యుల ద్వారా పత్రాలను సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అధికార బిజెపి మినహా మిగిలిన అన్ని పక్షాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఓటర్ల తొలగింపు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి భావిస్తుండగా, కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లిస్ (AIMIM) పార్టీలు దీనిని బిజెపి రాజకీయ అస్త్రంగా విమర్శిస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పుతో దేశవ్యాప్తంగా ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ చట్టబద్ధతను సంతరించుకుంది. ఎన్నికల సంఘం విధుల్లో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఈ చట్టం తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో, రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించే కంటే, ప్రజలను చైతన్యపరిచి ప్రక్రియను విజయవంతం చేయాలని తమ కార్యకర్తలను ఆదేశించాయి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ దిశగా ముమ్మరంగా కృషి చేస్తున్నాయి.

తెలంగాణలో ఈ ప్రచారం ప్రారంభానికి కేవలం ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉన్నందున, యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలి. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి, పేద, నిరక్షరాస్యులైన ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలి. తద్వారా లక్షలాది మంది పేర్లు 2026 ఓటర్ల జాబితాలో చేర్చబడతాయి.

భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను మరోసారి ఇక్కడ గుర్తుచేస్తున్నాము:

1. **జూలై 1, 1987 కంటే ముందు జన్మించి, 2002 ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు:** వీరు ఎలాంటి కొత్త పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. 2002 జాబితా ఆధారంగా వీరి పేర్లు నేరుగా నమోదు చేయబడతాయి.

2. **జూలై 1, 1987 కంటే ముందు జన్మించి, 2002 ఓటర్ల జాబితాలో పేరు లేనివారు:** వీరు గుర్తింపు పురావాగా ఎన్నికల సంఘం సూచించిన 11 అధికారిక పత్రాలలో ఏదో ఒకదానిని సమర్పించాలి.

3. **జూలై 1, 1987, డిసెంబర్ 12, 2004 మధ్య జన్మించిన పౌరులు:** వీరు తమ స్వంత గుర్తింపు పత్రంతో పాటు తమ తండ్రి లేదా తల్లి గుర్తింపు పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

4. **డిసెంబర్ 12, 2004 తర్వాత జన్మించి, 18 ఏళ్లు నిండిన యువత:** వీరు తమ గుర్తింపు పత్రంతో పాటు, తల్లిదండ్రుల యొక్క నిర్దేశిత 13 పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

5. **లింకేజ్ (మ్యాపింగ్):** నూతన ఓటర్ల నమోదుకు 2002 ఓటర్ల జాబితాయే ప్రధాన ప్రాతిపదిక. కాబట్టి, ప్రస్తుత జాబితాలో పేరు లేని వారు తమ తల్లిదండ్రుల లేదా తాత ముత్తాతల పేర్లతో అనుసంధానం చేయాలి. దీనినే ‘ప్రోజెని’ (Progeny) లేదా మ్యాపింగ్ అంటారు.

ఎన్నికల సంఘం ఆమోదించిన 11 పత్రాలలో జనన ధృవీకరణ పత్రం (Birth Certificate), ఎస్.ఎస్.సి మెమో, పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్, ఆస్తి పత్రాలు, కుల, నివాస ధృవీకరణ పత్రాలు ముఖ్యమైనవి. అయితే, ఈ ప్రక్రియ నిర్వహణకు నియమించబడిన క్షేత్రస్థాయి అధికారులలో చాలామందికి దీనిపై కనీస అవగాహన లేకపోవడం ఆందోళనకరం. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిత్రం ప్రకారం, కనీస అక్షరాస్యత లేని నాల్గవ తరగతి మున్సిపల్ ఉద్యోగిని బూత్ స్థాయి అధికారిగా (BLO) నియమించడం జరిగింది. ఇటువంటి లోపాల వల్ల ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, పౌరులు కేవలం అధికారులపైనే ఆధారపడకుండా, తమ దరఖాస్తులను తామే స్వయంగా సరిచూసుకుని, ఆన్‌లైన్ అప్‌లోడ్ వివరాలను భద్రపరుచుకోవాలి. ముసాయిదా జాబితాలో లోపాలు ఉంటే, ఈ ఆధారాల ద్వారా తుది జాబితాలో పేరును సరిచేసుకోవచ్చు.ప్రభుత్వ యంత్రాంగంపై గుడ్డి నమ్మకం ఉంచడం వివేకవంతమైన చర్య కాదు.

బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో పౌరులు సరైన పత్రాలు సమర్పించినప్పటికీ, సాంకేతిక కారణాలతో లక్షలాది మంది ముస్లింల పేర్లు ఓటర్ల జాబితా నుండి మాయమయ్యాయి. ఎస్.ఐ.ఆర్ లోని ఈ ప్రస్తుత దశ ముస్లిం సమాజానికి అత్యంత కీలకమైన పరీక్షా సమయం. పరిస్థితి తీవ్రతను, గాంభీర్యాన్ని గ్రహించి, ప్రతి ఒక్కరూ తమ పౌర బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాము. లేనిపక్షంలో, చరిత్రలో ఈ ఉర్దూ కవితా పంక్తులు నిజమవక తప్పదు:

*’యె జబ్ర్ భీ దేఖా హై తారీఖ్ కీ నజ్రోన్ నే*. *లమ్హోన్ నే ఖతా కీ థీ సదియోన్ నే సజా పాయీ’* *(కాల గమనంలో చరిత్ర ఈ అన్యాయాన్ని కూడా వీక్షించింది… తప్పులు కొన్ని క్షణాలపాటు జరిగితే, దానికి శతాబ్దాల తరబడి శిక్షను అనుభవించాల్సి వస్తుంది!

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.