కారకాస్: వెనిజులాలో పెను విషాదం చోటుచేసుకుంది. భయంకరమైన జంట భూకంపాలు సంభవించిన ఒక రోజు తర్వాత, లా గువైరా తీరప్రాంత నగరంలో ప్రజలు తమ పొరుగువారిని రక్షించడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. శిథిలాలను తవ్వుతున్నారు.
“మేము మాకు చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ పరికరాల కొరత ఉంది,” అని కార్లోస్ బోర్జెస్ అన్నారు. ఒకప్పుడు ఎత్తైన అపార్ట్మెంట్ భవనాలుగా ఉన్న కాంక్రీట్ స్లాబ్ల కుప్పలను తొలగించడానికి బ్యాక్హోల వంటి యంత్రాల కొరత తనను నిరాశపరిచిందని ఆయన చెప్పారు.
గురువారం ఉదయం, తప్పిపోయిన ఒక టీనేజ్ బాలుడి ఒంటరి తల్లితో సహా ఇతర ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలంలో వేచి ఉండగా, అతని బృందం ఒక భవనం నుండి ముగ్గురిని బయటకు తీసింది.
నిన్న రాజధాని కారకాస్, దాని పరిసర ప్రాంతాలలో రెండు శక్తివంతమైన భూకంపాలు బీభత్సం సృష్టించిన తర్వాత మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే నమూనాలు సూచించాయి. ఇప్పటిదాకా కనీసం 235 మంది మరణించారని, 1520 మంది గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రభుత్వం ధృవీకరించింది.
బీచ్కు వెళ్లేవారికి ప్రసిద్ధ ప్రదేశమైన, దేశంలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న నగరమైన లా గువైరా, భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న మోరాన్ నివాసితులు, పరిమిత అధికారిక సహాయం మధ్య ప్రాణభయంతో వణికిపోతున్నారు.
“అందరూ రండి, వచ్చి సహాయం చేయండి. వారిని సాయుధ వాహనంలో ఎక్కించి ప్రజలకు సహాయం చేయడానికి రండి. మీకు దొరికిన చోటల్లా ట్రాక్టర్లను తీసుకురండి,” అని శిథిలాల మధ్య తన బంధువు కోసం వెతుకుతున్న లా గువైరాలోని లాస్ కొరాలెస్ ప్రాంత నివాసి అర్జెనిస్ మార్టినెజ్ అన్నారు.
గృహ వినియోగ గ్యాస్ సరఫరా నిలిపివేసినప్పటికీ, రాత్రికి రాత్రే కొన్ని శిథిలాలకు నిప్పంటుకుంది. దీంతో స్థానికులు భయపడ్డారు. చాలామందికి వెళ్ళడానికి వేరే చోటు లేక, ప్రాణాలతో ఉన్నవారి కోసం వెతుకుతున్నారు.
ప్రధానంగా లా గువైరాలో 250 భవనాలు దెబ్బతిన్నాయని చెప్పిన ప్రభుత్వం, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, ఖతార్ నుండి సహాయం వస్తుందని తెలిపింది. అలాగే సహాయక చర్యల కోసం బ్యాక్హోల వంటి పరికరాలను అప్పుగా ఇవ్వాలని ప్రైవేట్ రంగానికి పిలుపునిచ్చింది.
లా గువైరాలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఆహారం, నీటి కోసం వెతుకుతున్నారు. కనీసం రెండు దుకాణాలలో దోపిడీ జరుగుతుండగా రాయిటర్స్ బృందం ప్రత్యక్షంగా చూసింది. నగరంలోని జోస్ మారియా వర్గాస్ ఆసుపత్రి గాయపడిన వారితో కిక్కిరిసిపోయింది. కొందరు రోగులకు బయట చికిత్స అందిస్తుండగా, పోలీసులు భవనంలోకి ప్రవేశాన్ని పరిమితం చేశారు. తమ వద్ద పాత్రికేయులకు చెప్పడానికి ఎలాంటి సమాచారం లేదని అక్కడి అధికారులు తెలిపారు.
“ఇది ఒక విషాదం,” అని 60 ఏళ్ల బీట్రిజ్ రోడ్రిగ్జ్ అన్నారు. భూకంపాల్లో కాళ్లు నలిగిపోవడంతో ఆసుపత్రిలో ఆమె మేనల్లుడి కాళ్లను తొలగించారు. ఆరేళ్ల వయసున్న మరో మేనల్లుడు మరణించాడు.
లా గువైరాలో ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ అత్యవసర శస్త్రచికిత్సలు చేయగలమని సాయుధ దళాల కమాండ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. “మాకు రక్తపోటు మానిటర్లు, థర్మామీటర్లు, గ్లౌజులు, ప్లాస్టర్, నొప్పి నివారణ మందులు — అన్నీ కావాలి,” అని రామిరెజ్ రాయిటర్స్తో అన్నారు.
భూకంపాల వల్ల ఇళ్లు కూలిపోయి, పట్టణంలో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయినప్పటి నుండి, ఆయన, మరో ఇద్దరు వైద్యులు, ఇతర సిబ్బంది కలిసి 112 మందికి చికిత్స అందించారు. పుర్రె పగలడం, ఇతర గాయాల కారణంగా ముగ్గురు పిల్లలతో సహా తొమ్మిది మంది మరణించారు.
సహాయక చర్యలు నెమ్మదిగా సాగాయి. భూకంపాలు సంభవించి గంటలు గడిచినా శిథిలాల కింద మృతదేహాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు, చిక్కుకుపోయి, గాయపడిన వారిలో కొందరికి సమయం మించిపోయింది.
అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న లా గువైరా నగరంలో, ఒక చిన్నారి గంటల తరబడి సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుండగా స్థానికులు నిస్సహాయంగా వింటూ ఉండిపోయారు. “ఆమెను బయటకు తీసుకురావాలంటే, మాకు సహాయం చేయడానికి ప్రజలు… సైనిక సిబ్బంది రావాలి,” అని 48 ఏళ్ల స్థానికుడు డాని రిజో అన్నారు.
కొద్దిసేపటికే ఆ బాలిక మరణించిందని స్థానికులు ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు. లా గువైరాలోని మరోచోట, కూలిపోయిన భవనం శిథిలాల కింద ముగ్గురు వ్యక్తుల అరుపులు వినిపించాయి. “వారు ఇంకా బతికే ఉన్నారు… మేము చేయగలిగింది ఇంకేమీ లేదు,” అని స్థానికులలో ఒకరైన ఆంటోనియో బెర్ముడెజ్ అన్నారు. “మా దగ్గర పనిముట్లు లేవు. సహాయం చేయడానికి మాకు మార్గం లేదని ఆయన వాపోయారు.”


