Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

ధర్మేంధ్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిరసన ఉధృతం!

Share It:

న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై తన పోరాటాన్ని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఉధృతం చేయనుంది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రకటించారు. మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ జూన్ 28న జంతర్ మంతర్ వద్ద తనతో చేరాలని విద్యార్థులు, రైతులు, పౌర సమాజ సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో దిప్కే మాట్లాడుతూ… ఆదివారం జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ ఉద్యమంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా పాల్గొంటారని, అలాగే నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తారని తెలిపారు. అయితే, ఈ ఉద్యమ కార్యాచరణ లేదా వివరాల గురించి ఆయన స్పష్టంగా వెల్లడించలేదు.

దర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని CJP వ్యవస్థాపకుడు కోరారు; ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే, మోదీని “అసమర్థ ప్రధాని”గా పరిగణించాల్సి వస్తుందని ఆయన అన్నారు.

డిజిటల్ వ్యంగ్య వేదికగా ప్రారంభమైన CJP, పరీక్షల్లో అక్రమాలు, నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జూన్ 20 నుండి జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడుతోంది. “ఒక వారం గడిచినా, పేపర్ లీక్‌లకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ ఎటువంటి బాధ్యత వహించలేదని” దిప్కే అన్నారు.

“విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరూ బాధ్యత వహించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికే 20 మంది విద్యార్థులు మరణించినా, వాంగ్‌చుక్ వంటి విద్యావేత్త, శాస్త్రవేత్త నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.”

“ఇంకా సమయం మించిపోలేదు. ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎందుకంటే ఆ విద్యార్థుల మరణాలకు ఆయనే బాధ్యుడు. ఆయన మమ్మల్ని ఉగ్రవాదులని పిలిచారు, కానీ ఆయనే అసలైన ఉగ్రవాది; ఎందుకంటే ఈ విద్యార్థుల మరణాలకు ఆయనే కారణం,” అని దిప్కే పేర్కొన్నారు.

“ప్రధాన్ గో బ్యాక్” (Pradhan Go Back) నిరసన గురించి మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించాలని CJP భావిస్తోందని ఆయన చెప్పారు. ఆదివారం జంతర్ మంతర్ వద్దకు రావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రైతు సంఘాలు, పౌర సమాజ సమూహాలకు ఆయన పిలుపునిచ్చారు. “జవాబుదారీతనం లేకుండా ఈ దేశం ఎంతకాలం నడుస్తుంది? ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయకపోవడం మంచి విషయమేనా? అని దిప్కే ప్రశ్నించారు”.

“ప్రధాన్ పదవి నుండి తప్పుకునేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలి, లేకపోతే విద్యార్థుల మరణాలకు ఆయనే ప్రత్యక్ష బాధ్యుడిగా పరిగణించబడతారు.” “ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోకపోతే, భారతదేశ ప్రధానమంత్రిగా ఆయన అసమర్థుడే,” అని CJP వ్యవస్థాపకుడు అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని కూడా దిప్కే డిమాండ్ చేశారు.

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరసన గురించి అడిగినప్పుడు, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పార్టీలు విద్యార్థుల తరఫున గళం విప్పాలని దిప్కే సూచించారు. ప్రధాన్ రాజీనామాతో CJP ఆందోళన ముగుస్తుందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆ విషయంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు.

ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటే ప్రజాగ్రహం తగ్గుతుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, “తగ్గదు, కానీ ముందుగా రాజీనామా జరగనివ్వండి,” అని దిప్కే అన్నారు.
జంతర్ మంతర్ వద్ద ఉన్న కొందరు నిరసనకారులు మరియు వాలంటీర్లపై దుండగులు దాడి చేశారని, ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

“నిరసనకారులకు ఆహారం తెస్తున్న వారిని వేధిస్తున్నారు. ఒక సందర్భంలో, వారు ఒక వాలంటీర్ అత్తమామల ఇంటికి కూడా వెళ్లారు. మాపై దాడి చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతుంటే, పోలీసులు మాత్రం కోర్టు ఆదేశాలు కావాలని అంటున్నారు. ఇదంతా ముందస్తు ప్రణాళికతో జరిగిందేమోనని నాకు అనుమానంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటన వెనుక ఉన్నవారిపై ‘హత్యాయత్నం’ (attempt to murder) కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వాలంటీర్ తలకు తీవ్ర గాయమైనప్పటికీ, నిందితులపై పోలీసులు సరైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు.

ఇదే సమయంలో, శుక్రవారం మధ్యాహ్నం దాస్, విజేత దహియా మరియు అశుతోష్ రంకా ప్రధాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కోసం కేక్ తీసుకుని కర్తవ్య భవన్‌లోని విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లారు. అయితే, తమను ఆ ప్రాంగణంలోకి అనుమతించలేదని వారు తెలిపారు.

“ప్రధాన్ జీ, పుట్టినరోజు శుభాకాంక్షలు. మమ్మల్ని లోపలికి అనుమతించలేదు.” “మేము మీకు ఈ కేక్ రూపంలో ఒక బహుమతి తెచ్చాము… మీరు కూడా మాకు ఒక బహుమతి ఇచ్చి రాజీనామా చేయాలి,” అని రాంకా అన్నారు. ఇది “వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం” అని చెబుతూ, తమ పిల్లలను నిరసనలో చేరకుండా ఆపవద్దని తల్లిదండ్రులకు కూడా దీప్కే ఎక్స్‌లో విజ్ఞప్తి చేశారు.

వైష్ణవి గౌర్, ఆఫ్రీన్ నవాజ్, దీపక్ బలియాన్, రత్న సింగ్‌లను సంస్థలోకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులుగా చేర్చుకుంటున్నట్లు దాస్ కూడా ప్రకటించారు. పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేసిన గౌర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, థింక్ ట్యాంకులలో అనుభవంతో ప్రజా విధాన రంగంలో పనిచేశారని దాస్ చెప్పారు.

ఆఫ్రీన్ నవాజ్ ఒక పారిశ్రామికవేత్త,తన సొంత సంస్థ వ్యవస్థాపకురాలు కాగా, దీపక్ బలియాన్ గత ఎనిమిదేళ్లుగా రైతు ఉద్యమాలతో అనుబంధం కలిగి ఉన్నారు. రత్న సింగ్ ఒక న్యాయ పాత్రికేయురాలు, ప్రాక్టీసింగ్ న్యాయవాది.

కాగా, జూన్ 28న జంతర్ మంతర్ వద్ద జరగనున్న ప్రదర్శన కోసం, అంకిత్ భరద్వాజ్, అక్షయ్ షిండే, రసికా ఖరత్, షహ్రిన్, ప్రేమాకాష్ మామగ్, జైసింగ్ షేర్, దుర్గేష్ కుహికే, మహమ్మద్ జునైద్, యోగేష్ ఇంగలే, రేఖా శర్మ, విశాల్ సైని, సుధీర్ సంగ్వాన్, విజయ్ మల్లంగి మరియు రామ్ జాఖర్‌లతో కూడిన ఒక నిరసన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నవాజ్ ప్రకటించారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.