న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలోని అనేక కీలక రంగాలపై చైనా తన పట్టును మరింత బిగించేందుకు అనుమతించడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతదేశ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. 2020లో గాల్వాన్ ఘర్షణ జరిగినప్పటి నుండి చైనా దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా పెరిగిందని కూడా పేర్కొంది. వ్యూహాత్మక పరిశ్రమలలో భారతదేశం చైనా సరఫరాలపై నిరంతరం ఆధారపడటంపై వచ్చిన ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలవని భావిస్తున్న రంగాలు చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని అన్నారు.
ఈ మేరకు ఖర్గే మాట్లాడుతూ, ఆరేళ్ల క్రితం గాల్వాన్ లోయ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించినప్పటికీ, ప్రభుత్వం భారతదేశ ప్రయోజనాలను బీజింగ్కు వాస్తవంగా “సమర్పించిందని” అన్నారు. 2025-26 నాటికి చైనా నుండి భారతదేశ దిగుమతులు 101.81 శాతం పెరిగాయని, దీంతో ద్వైపాక్షిక వాణిజ్య లోటు 112.1 బిలియన్ డాలర్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. 2024-25లో భారతదేశ యాంటీబయాటిక్ దిగుమతులలో 86 శాతం, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియట్ల దిగుమతులలో దాదాపు 74 శాతం చైనా నుండే జరిగాయని ఖర్గే అన్నారు.
భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల (EV) విడిభాగాల దిగుమతులలో 66 శాతం చైనా నుండే వస్తున్నాయని, అలాగే భారతీయ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలలో అధిక భాగం ఆ దేశం నుండే దిగుమతి అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సౌర ఘటాలకు (సోలార్ సెల్స్) కీలకమైన ముడిసరుకు అయిన అన్డిఫ్యూజ్డ్ సిలికాన్ వేఫర్ దిగుమతులలో 99 శాతానికి పైగా ఆ దేశమే సరఫరా చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఇటీవలి విధాన నిర్ణయాలను లక్ష్యంగా చేసుకుని, భారతదేశంలోని ప్రభుత్వ విద్యుత్ ప్రాజెక్టులకు బిడ్లు వేయడానికి నాలుగు చైనా కంపెనీలను అనుమతించేలా ప్రభుత్వం ఆంక్షలను సడలించిందని ఖర్గే ఆరోపించారు.
వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లలో చైనా తన ఆక్రమణలను కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ చర్యలలో చైనా పాత్రను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంగీకరించారని, అది అధికారిక రికార్డులో కూడా ఉందని ఖర్గే పేర్కొన్నారు. “గాల్వాన్ ఘటన తర్వాత భారతదేశంలోని అత్యంత కీలకమైన పరిశ్రమలను బీజింగ్ చేజిక్కించుకోవడానికి అనుమతించడం ద్వారా మోదీ ప్రభుత్వం భారతదేశ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసింది,” అని వాణిజ్యం, వ్యూహాత్మక విధానాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును కార్గే విమర్శించారు.
కాగా, కాంగ్రెస్ నాయకుడి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం గానీ, భారతీయ జనతా పార్టీ గానీ వెంటనే స్పందించలేదు.

