న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ స్థాపించిన ‘మహ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ’కి చెందిన 38 భవనాలపై జారీ చేసిన కూల్చివేత నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ (RDA)ని కోరింది. ఈ చర్య కక్షపూరితమైనది,అన్యాయమైనదిగా బోర్డు అభివర్ణించింది.
జైలులో ఉన్న నాయకుడు స్థాపించిన ఈ విశ్వవిద్యాలయానికి జారీ చేసిన కూల్చివేత నోటీసులను ఖండిస్తూ, చట్టపరమైన లేదా సాంకేతిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఈ ముఖ్యమైన విద్యా సంస్థను రక్షించాలని AIMPLB అధికారులను కోరింది.
RDA జారీ చేసిన 38 భవనాల కూల్చివేత నోటీసును ఖండించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ప్రతిపాదిత చర్యను తక్షణమే నిలిపివేయాలని, నోటీసును ఉపసంహరించుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ చర్య కేవలం ఒక విద్యా సంస్థకు వ్యతిరేకంగానే కాకుండా, ముస్లిం సమాజ విద్యా పురోగతికి కూడా వ్యతిరేకంగా ఉందని బోర్డు ప్రతినిధి ఎస్.క్యూ.ఆర్. ఇల్యాస్ అన్నారు.
ముస్లింల విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పటికీ, ప్రజల చొరవ, త్యాగం, నిరంతర కృషి ద్వారా స్థాపితమైన సంస్థలను పరిపాలనాపరమైన, చట్టపరమైన చర్యల ద్వారా ఏదో ఒక సాకుతో లక్ష్యంగా చేసుకోవడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత చర్య ఆజం ఖాన్పై రాజకీయ కక్షసాధింపును ప్రతిబింబిస్తోందని AIMPLB తెలిపింది. విశ్వవిద్యాలయానికి చెందిన 40 భవనాలలో 38 భవనాలు అవసరమైన అనుమతులు లేకుండానే నిర్మించారన్న RDA వాదనను ఇల్యాస్ తోసిపుచ్చారు.
విశ్వవిద్యాలయ యంత్రాంగం ప్రకారం, ఆ భవనాలు నిర్మించిన సమయంలో ఆ ప్రాంతం రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి రాలేదని ఆయన చెప్పారు.
అందువల్ల, భవన నిర్మాణ ప్రణాళికలకు RDA నుండి అనుమతి పొందాల్సిన చట్టపరమైన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏవైనా సాంకేతిక లేదా చట్టపరమైన లోపాలు ఉన్నప్పటికీ, వాటిని సరైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన అన్నారు.
ఏళ్ల తరబడి కఠోర శ్రమ, ప్రజల మద్దతు, భారీ పెట్టుబడితో స్థాపించిన విశ్వవిద్యాలయానికి చెందిన 38 భవనాలను కూల్చివేయాలని ఆదేశించడం అనేది అసంబద్ధమైన, ఏకపక్ష చర్య మాత్రమే కాకుండా, దేశంలో విద్య విస్తృత ప్రయోజనాలకు విరుద్ధమని ఇల్యాస్ పేర్కొన్నారు. “ఇటువంటి చర్య కేవలం ఒక సంస్థను లేదా ఒక వర్గాన్ని మాత్రమే ప్రభావితం చేయదు; ఇది దేశ విద్యాపరమైన ఆస్తులకు తీరని నష్టాన్ని కలిగిస్తుంది” అని బోర్డు ప్రతినిధి ఎస్.క్యూ.ఆర్. ఇల్యాస్ అన్నారు.

