టెహ్రాన్: అమెరికా దాడులు కొనసాగితే, తాము దాడులను తీవ్రతరం చేస్తామని ఇరాన్ సీనియర్ సైనిక సలహాదారు ఒకరు హెచ్చరించిన నేపథ్యంలో, శుక్రవారం అమెరికా, ఇరాన్లు పరస్పరం డ్రోన్, క్షిపణి దాడులు చేసుకున్నాయి. “ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడమే” లక్ష్యంగా అమెరికా దళాలు వరుసగా ఏడవ రాత్రి కూడా ఇరాన్పై దాడులు చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ‘ఎక్స్’ పోస్ట్లో తెలిపింది.
ఇరు దేశాల మధ్య ఘర్షణలు పునఃప్రారంభమైనప్పటి నుండి ఇది అతిపెద్ద ఉద్రిక్తతగా మారింది. ఒక విమానాశ్రయం, రైల్వే స్టేషన్, రెండు వంతెనలతో సహా పౌర మౌలిక సదుపాయాలను అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ ఆరోపించింది. అంతేకాకుండా, ఈ ప్రాంతమంతటా ఉన్న అమెరికా ఆస్తులపై కూడా దాడులు చేసినట్లు పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు, కానీ శుక్రవారం అమెరికా దళాలు ఆ దాడులు ప్రారంభించినట్లు అమెరికా వైపు నుండి ఎటువంటి నిర్ధారణ రాలేదు.
కాగా, ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై ఐరాస అధిపతి ఆంటోనియో గుటెర్రెస్ “తీవ్ర ఆందోళన” వ్యక్తం చేశారు. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు “ఆమోదయోగ్యం కావు” అని ఆయన అన్నారు.
ఇరాన్ సర్వోన్నత నాయకుడికి సీనియర్ సైనిక సలహాదారు అయిన మేజర్ జనరల్ మొహ్సెన్ రెజాయీ, అమెరికా దాడులు మరో రెండు మూడు రోజులు కొనసాగితే టెహ్రాన్ “పూర్తిస్థాయి దాడి చర్యలను” తిరిగి ప్రారంభిస్తుందని అన్నారు.
“ఇరాన్ ఇకపై ప్రతీకార, దీటుగా స్పందనలకు పరిమితం కాదు… ఏ రాజకీయ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదు,” అని ఇరాన్ వార్తా సంస్థ ఐఆర్ఐబి ప్రకారం రెజాయీ అన్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతీకారంగా, ప్రపంచంలోని అధిక చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ సమర్థవంతంగా మూసివేసింది, గల్ఫ్ అంతటా ఇజ్రాయెల్, అమెరికా ప్రయోజనాలపై దాడులు ప్రారంభించింది.
దక్షిణాన, జలసంధి చుట్టూ ఉన్న ఇరాన్ తీరప్రాంత సౌకర్యాలపై అమెరికా తన కార్యకలాపాలను ముగించే వరకు “శత్రువుపై ఇరాన్ నలుమూలల నుండి లక్షిత దాడులు కొనసాగుతాయి” అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మజీద్ మౌసావి అన్నారు.
పారిస్కు చెందిన థింక్-ట్యాంక్ అయిన జీన్-జౌరెస్ ఫౌండేషన్లో మధ్యప్రాచ్య నిపుణుడైన డేవిడ్ ఖల్ఫా, “విస్తృత శ్రేణి వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు” ఇప్పుడు ఈ సంఘర్షణలోకి లాగుతున్నాయని పేర్కొన్నారు.
“విచిత్రం ఏమిటంటే, సంఘర్షణ తీవ్రమవుతున్నప్పటికీ, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగడానికి అనుమతించడంలో ఏ పక్షానికీ వ్యూహాత్మక ప్రయోజనం లేదు. అయినప్పటికీ, ఇరు పక్షాలు ఏ రాజీనైనా లొంగిపోవడంగానే భావిస్తున్నాయి,” అని ఖల్ఫా ఏఎఫ్పీకి తెలిపారు.
దురాక్రమణదారుడిని శిక్షించండి
ఇంధన కేంద్రాలపై అమెరికా దాడులు చేయడం వల్ల విద్యుత్ గ్రిడ్ ఒత్తిడికి గురైందని పేర్కొంటూ, కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినప్పటికీ, ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ పౌరులను విద్యుత్ వాడకాన్ని తగ్గించుకోవాలని, రద్దీ సమయాల్లో ఎయిర్ కండిషనర్లను ఆపివేయాలని కోరింది.
తమపై ఏవైనా దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది, శుక్రవారం విస్తృతమైన దాడులను ప్రారంభించింది.
కువైట్లో, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని టెహ్రాన్ చెప్పగా, ఇరాన్ దాడిలో ఒక విద్యుత్, నీటి ప్లాంట్ దెబ్బతిన్నదని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులను విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని కోరింది.
ఇరాన్ డ్రోన్లు తమ పలు స్థావరాలు, శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడంతో పలువురు సైనికులు గాయపడ్డారని కువైట్ సైన్యం తెలిపింది. “దురాక్రమణదారుడిని శిక్షించడానికి” ఖతార్లోని అమెరికా రాడార్ వ్యవస్థలు మరియు సైనిక విమానాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ గార్డ్స్ చెప్పగా, ఒక క్షిపణి దాడిని అడ్డుకున్నామని దోహా పేర్కొంది.
కాగా, పోరాటం తిరిగి ప్రారంభమైనప్పటి నుండి దేశంలో కనీసం 38 మంది మరణించారని,400 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవంక మధ్యవర్తులు ఇరుపక్షాలను తిరిగి చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. అమెరికా, ఇరాన్లు పోరాటాన్ని ఆపి చర్చలను పునఃప్రారంభించాలని చైనా, పాకిస్తాన్లు పిలుపునిచ్చాయి.
ఈ విస్తృత ఉద్రిక్తతలలో భాగంగా, అమెరికా ఇరాన్ ఓడరేవులపై తన దిగ్బంధనాన్ని తిరిగి విధించింది. హర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఒమన్ తీరంలో ఒక ట్యాంకర్పైకి క్షిపణి దాడి జరిగిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఏజెన్సీ తెలిపింది.
