న్యూఢిల్లీ: దేశంలో యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రస్తుత విద్యా, ఉపాధి వ్యవస్థల వైఫల్యమే కారణమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ… ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల యువత భవిష్యత్తు అంధకారంలోకి నెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో తాను కలిసిన ఒక విద్యార్థి “నాకు ఇక వేరే మార్గం లేదు” అని చెప్పాడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఎదుర్కొంటున్న కష్టాలకు ఆ విద్యార్థి పరిస్థితి ఒక నిదర్శనమని ఆయన అన్నారు.
ఆ విద్యార్థి పరీక్షల కోసం ఏళ్ల తరబడి సన్నద్ధమయ్యాడని, కుటుంబానికి చెందిన భూమిని అమ్మేశాడని, తల్లిదండ్రులను అప్పుల ఊబిలోకి నెట్టాడని, అయినా అతని శ్రమకు తగిన ఫలితం దక్కలేదని పేర్కొన్నారు. ఆ విద్యార్థి పరిస్థితి అతని వ్యక్తిగత వైఫల్యం కాదని, అతని కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడంలో విఫలమైన వ్యవస్థ వైఫల్యమని ఆయన అన్నారు. “ఇది అతని వైఫల్యం కాదు. అతని కష్టానికి విలువ ఇవ్వని వ్యవస్థ వైఫల్యం ఇది,” అని గాంధీ అన్నారు.
విద్యార్థుల నిరసనల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై గాంధీ విమర్శలు గుప్పించారు. హోం మంత్రి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకుండా 13 రోజులు గడిచిపోయాయని ఆయన ఎత్తిచూపారు. హోం మంత్రి అమిత్ షా నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. క్షమాపణ చెప్పడానికి బదులుగా, ప్రధాని మోదీ ‘క్షమాభిక్ష’ ప్రసాదిస్తున్నారు,” అని ఆయన అన్నారు.
పరీక్షలకు సంబంధించిన సమస్యలపై విద్యార్థులు, యువత చేపట్టిన నిరసనలు, ఢిల్లీలో ఆందోళనల సమయంలో పోలీసులు జరిపిన చర్యల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
అమిత్ షాను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతిపక్షం బాధ్యతను ప్రశ్నిస్తూనే ఉంటుందని గాంధీ స్పష్టం చేశారు. “అమిత్ షా గారూ, మేము బాధ్యతను ప్రశ్నించడం ఆపేస్తామని అనుకోవద్దు,” అని ఆయన అన్నారు. దేశ రాజధాని వీధుల్లో విద్యార్థులపై పోలీసులు లాఠీలు, పెల్లెట్ గన్లను ప్రయోగించారని రాహుల్గాంధీ ఆరోపించారు, ఈ ఘటనపై హోం మంత్రి మౌనాన్ని ప్రశ్నించారు.
“ఈ రోజు కాకపోయినా రేపైనా, ఈ నేరానికి మీరు సమాధానం చెప్పక తప్పదు,” అని ఆయన జోడించారు.
నిరసన తెలుపుతున్న విద్యార్థులకు తన మద్దతు కొనసాగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు. “విద్యార్థులే దేశానికి వెలుగు, నేను నా శక్తిమేర వారికి అండగా నిలబడతాను,” అని ఆయన అన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులతో సంభాషించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత యువతను దేశం “అత్యంత గొప్ప శక్తి”గా అభివర్ణించిన గాంధీ, విద్యా ధృవీకరణ పత్రాలు యువతకు ఉద్యోగాలు పొందడంలో సహాయపడలేకపోతే ఆ విద్యా విధానానికి పెద్దగా అర్థం ఉండదని పేర్కొన్నారు.
