రాంచీ: జార్ఖండ్లో వారాల తరబడి సాగిన విద్యార్థి ఆందోళనల నేపథ్యంలో…ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని పరీక్షలు, నియామక ప్రక్రియలను హేమంత్ సోరెన్ ప్రభుత్వం రద్దు చేసింది. JPSC (జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), JSSC CGL (జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్) పరీక్షలు కూడా ఇందులో ఉంటాయని, 2014 వరకు జరిగిన ప్రక్రియపై విచారణ జరుగుతుందని ముఖ్యమంత్రి సోరెన్ హామీ ఇచ్చారు. అయితే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)తో విచారణ జరపాలన్న డిమాండ్పై పట్టుబడుతూ విద్యార్థులు తమ ఆందోళనను విరమించడానికి నిరాకరించారు.
“TDPL (లక్నోకు చెందిన TSR డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్) ప్రకటించిన ఫలితాలు, ఆ సంస్థ ద్వారా ఎంపికైన లేదా పాల్గొన్న అభ్యర్థులు,ఇక్కడ జరిగిన TDPL కార్యకలాపాలన్నీ రద్దు చేస్తున్నామని” సోరెన్ విద్యార్థులతో అన్నారు.
“2014 నుండి జరిగిన తప్పులన్నింటిపైనా విచారణ జరుగుతుంది. 2014 నుండి జార్ఖండ్లో నిర్వహించిన అన్ని పరీక్షలపై CID విచారణ జరుపుతుందని” సోరెన్ పేర్కొన్నారు. ” IAS అధికారి అమితాబ్ కౌశల్ అధ్యక్షతన సంస్కరణల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని” సీఎం తెలిపారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, పరీక్షా విధానంలో సంస్కరణలు, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన పరీక్షలలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2024లో ప్రశ్నపత్రాలు లీక్ అయిన JSSC-CGL పరీక్షల రద్దు వారి ప్రధాన డిమాండ్లలో ఒకటి.
ఆందోళన కొనసాగిస్తామన్న విద్యార్థులు
ప్రభుత్వ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే, విద్యార్థి నాయకుడు రవీంద్ర పాశ్వాన్ మాట్లాడుతూ, CBI విచారణ జరపాలన్న తమ డిమాండ్ అంగీకరించే వరకు ఆందోళన కొనసాగుతుందని అన్నారు. “CBI విచారణ డిమాండ్ ఇంకా అంగీకరించలేదు, ఆ డిమాండ్ నెరవేరే వరకు మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తాము,” అని ఆయన చెప్పారు. “మేము ఒక కీలక పోరాటంలో విజయం సాధించాము, కానీ ఇంకా చాలా జరగాల్సి ఉంది… 24 రోజుల తర్వాత ఎట్టకేలకు మా డిమాండ్ను ఆలకించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే, సీబీఐ (CBI) విచారణ జరిపేంత వరకు మా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందన్నది వాస్తవమని” ఆయన అన్నారు.
విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో దీక్ష విరమణ
జార్ఖండ్ ప్రభుత్వ నియామక పరీక్షల రద్దు నిర్ణయం తర్వాత, 16 రోజులకు పైగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో రాంచీలోని సదర్ ఆసుపత్రిలో తన దీక్షను విరమించారు. రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఆయనకు రసం అందించి దీక్షను విరమింపజేశారు.
రాహుల్ గాంధీ లేఖ
నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరిన కొద్ది గంటలకే హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14న సోరెన్కు రాసిన లేఖలో, ఈ నిరసనలు “శాంతియుతంగా” సాగుతున్నాయని, విద్యార్థుల డిమాండ్లు “న్యాయమైనవి” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
“ఒకవేళ ముఖ్యమంత్రి మీ మాట వినకపోతే” సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని నిరసనకారులైన విద్యార్థులు శనివారం రాహుల్ గాంధీని కోరారు. గాంధీ తమకు మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి “కచ్చితమైన చర్యలు” తీసుకోలేదని వారు ఆ లేఖలో ఎత్తిచూపారు.
“భారత రాజ్యాంగం కల్పించిన శాంతియుత నిరసన హక్కు మన ప్రజాస్వామ్యానికి ప్రధాన స్తంభాలలో ఒకటి అని కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోంది.” అందువల్ల, గత కొన్ని నెలలుగా విద్యా వ్యవస్థలో పేపర్ లీక్లు, అవకతవకలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మేము పూర్తి మద్దతును అందించాము” అని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
