న్యూఢిల్లీ: తమ పేరు మీద ఇప్పటికే తొమ్మిది మొబైల్ సిమ్ కార్డులున్న వినియోగదారులకు… ఇకనుంచి కొత్త కనెక్షన్లను నిరాకరించాలని టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT)టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ఒక అధికారిక సర్క్యులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నిర్ణీత పరిమితికి మించి కనెక్షన్ కోరే వినియోగదారులను గుర్తించి, వారికి కొత్త సిమ్ కార్డులను నిరాకరించేందుకు తగిన సాంకేతికచర్యలను ఆగస్టు 24 నుండి అమలు చేయాలని టెలికాం ఆపరేటర్లను కోరారు.
“ఈమేరకు నిర్ణీత పరిమితికి మించి మొబైల్ కనెక్షన్లను పొందాలనుకునే వినియోగదారులను గుర్తించడానికి టెలికాం సేవా సంస్థలు (TSPs) తగిన సాంకేతిక, సంస్థాగత చర్యలు తీసుకోవాలి… అలాగే, ఒక వ్యక్తికి అనుమతించిన మేరకు గరిష్ట సంఖ్యలో మొబైల్ కనెక్షన్లు ఇప్పటికే వారి వద్ద ఉన్నాయని, అందువల్ల కొత్త మొబైల్ కనెక్షన్ ఇవ్వలేమని వారికి తెలియజేయాలని” కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
టెలికాం సంస్థలు అప్లోడ్ చేసిన వినియోగదారుల డేటా రికార్డుల ఆధారంగా, ఆ శాఖ ఏర్పాటు చేసిన ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారమ్’ (DIP)ను ఉపయోగించాలని టెలికమ్యూనికేషన్ల శాఖ టెలికాం సంస్థలను కోరింది. “నిర్ణీత పరిమితికి మించి మొబైల్ కనెక్షన్లను ఇప్పటికే పొందిన వినియోగదారుల వివరాలు DIPలో అందుబాటులో ఉన్నాయి,” అని సర్క్యులర్ తెలిపింది.
తమ పేరు మీద మొబైల్ కనెక్షన్ల విషయంలో నిర్ణీత పరిమితిని ఇప్పటికే చేరుకున్న వినియోగదారుల ఫోటోల ప్రతిరూపాలు (representative images) ఆగస్టు 23 నుండి DIPలో అందుబాటులో ఉంటాయని DoT తెలిపింది.
ఈ చర్య ద్వారా, నిర్ణీత పరిమితికి మించి కనెక్షన్ కోరే వినియోగదారులను గుర్తించడం, ఆ పరిమితిని దాటకుండా నిరోధించడం టెలికాం ఆపరేటర్లకు సాధ్యమవుతుంది. నవంబర్ 30 లోపు DIPతో ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించాలని DoT టెలికాం సంస్థలను కోరింది.
“టెలికాం సంస్థలు ఈ చర్యలను అమలు చేసే వరకు, కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (CAF) నిబంధనల ప్రకారం, నిర్ణీత పరిమితికి మించి యాక్టివేట్ చేసిన ఏ మొబైల్ కనెక్షన్ అయినా సరే, ఆ పరిమితిని దాటడానికి సంబంధించిన సమస్య పరిష్కారమయ్యే వరకు తక్షణమే నిలిపివేస్తామని” కేంద్రం తన ఉత్తర్వులో పేర్కొంది
