Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

తృణమూల్ గుర్తును స్తంభింపజేయడంపై ఈసీని విమర్శించిన రాహుల్ గాంధీ!

Share It:

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తును స్తంభింపజేసిన ఒక రోజు తర్వాత, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం బీజేపీతో “కుమ్మక్కు” అయిందని ఆయన ఆరోపించారు.

రెండు వర్గాల మధ్య పరస్పర విరుద్ధమైన వాదనల నడుమ, ఎన్నికల సంఘం గురువారం తృణమూల్ కాంగ్రెస్ “పువ్వు” గుర్తును స్తంభింపజేసింది. దీంతో, అక్టోబర్ 6న పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్‌లలో జరగనున్న ఉప ఎన్నికలలో ఈ రెండు వర్గాలు కూడా పార్టీ గుర్తును ఉపయోగించలేరు.

తృణమూల్ కాంగ్రెస్ విషయంలో శివసేన, ఎన్‌సిపిల కేసులను పోలుస్తూ, ఈసీఐ, బీజేపీల మధ్య “కుమ్మక్కు” జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. “మొదట శివసేన, ఆ తర్వాత ఎన్‌సిపి, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్. ప్రతిసారీ ఇదే పద్ధతి – ఒక పార్టీని చీల్చడానికి బిజెపి, ఎన్నికల సంఘం కుమ్మక్కు అవుతాయి. ఆ తర్వాత, దాని ఎన్నికల గుర్తును లాగేసుకుంటారు.” అని రాహుల్‌ గాంధీ Xలో పోస్ట్ చేశారు.

“ప్రజా తీర్పును కాపాడటమే ఈసీఐ రాజ్యాంగ బాధ్యత; దానికి బదులుగా, అది ప్రజల తీర్పును తారుమారు చేసే శక్తులకే సహాయం చేస్తోంది,” అని ఆయన పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి తన మద్దతును ప్రకటిస్తూ, ఇది ఆమె ఒక్కరి పోరాటం కాదని ప్రతిపక్ష నాయకుడు అన్నారు.

“ఈ పోరాటం కేవలం మమతా బెనర్జీది మాత్రమే కాదు; ఇది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను కోరుకునే ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఓటరు పోరాటం,” అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని, ‘ఓట్‌చోరీ’ ఆరోపణల చుట్టూ అల్లిన తన ప్రచారంతో ముడిపెడుతూ, ‘దొంగపార్టీ’ అనేది ‘ప్రజాస్వామ్య పతనానికి’ మరో చిహ్నమని అన్నారు.

“ఒక పార్టీ మొత్తాన్నే దొంగిలించగలిగితే, కోట్లాది మంది భారతీయుల ఓట్లను దొంగిలించడంలో ఆశ్చర్యం లేదు. ఓట్‌ చోరీ… దొంగిలించిన ప్రభుత్వం. ఇప్పుడు, పార్టీని చోరీ చేయడం – ఇవి మన ప్రజాస్వామ్య పతనానికి చిహ్నాలుగా మారాయని” రాహుల్‌ అన్నారు.

మమతా బెనర్జీ, రెబెల్ రిటాబ్రత బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు వర్గాల మధ్య జరుగుతున్న వాదనల నడుమ, తృణమూల్ కాంగ్రెస్ గుర్తును స్తంభింపజేయాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ & కేటాయింపు) ఉత్తర్వు, 1968లోని పేరా 15 ప్రకారం “సమగ్ర నిర్ధారణ” అవసరమని ఈసీ పేర్కొంది. ఆ నిర్ణయం వెలువడే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వు అమలులో ఉంటుంది. ఈమేరకు సెప్టెంబర్ 18న ఉదయం 11 గంటల లోపు, తమకు నచ్చిన పేర్లు, ఒక్కొక్కరికి మూడేసి చొప్పున స్వేచ్ఛా చిహ్నాలను సమర్పించాలని రెండు వర్గాలను కోరారు.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఏ వర్గం ప్రాతినిధ్యం వహిస్తుందో నిర్ధారించడానికి కమిషన్ విచారణ ప్రారంభించగా, అది రెండు వర్గాలను గుర్తించింది. వాటిలో ఒకటి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఉండగా, మరొకటి అరూప్ రాయ్ నేతృత్వంలో ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలిగా గుర్తింపు పొందిన రీతాబ్రత బెనర్జీ వర్గం, అరూప్ రాయ్‌ను పార్టీ చైర్‌పర్సన్‌గా నియమించింది.

మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన వెంటనే, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో ఈ తిరుగుబాటు చీలికకు కారణమైంది. గతంలో శివసేన, ఎన్‌సిపిలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయి. సేన విషయంలో ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సిపిలోని దివంగత అజిత్ పవార్ వర్గం వంటి తిరుగుబాటు వర్గాలు చివరికి పార్టీ పేరు, చిహ్నాన్ని దక్కించుకున్నాయి. ప్రస్తుతం ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ కొత్త పేర్లు, చిహ్నాలతో పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.