జయీముద్దీన్ అహ్మద్…✍️
ఈరోజు మనం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ప్రత్యేకించి హైదరాబాద్ దక్కన్ రాజకీయాల్లో నేటికీ ప్రతిధ్వనిస్తున్న ఒక చారిత్రక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటన 1948 సెప్టెంబర్ 17న జరిగింది, ఆ రోజే హైదరాబాద్ దక్కన్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. ఏటా సెప్టెంబర్ 17న వివిధ రాజకీయ పార్టీలు దీనిని వివిధ పేర్లతో స్మరించుకుంటాయి. కొందరు దీనిని “హైదరాబాద్ విమోచన దినోత్సవం” అనీ, మరికొందరు “హైదరాబాద్ విలీనం” అనీ, ఇంకొందరు “జాతీయ సమైక్యతా దినం” అనీ అంటారు; మరికొందరి దృష్టిలో ఇది “ఆపరేషన్ పోలో” ద్వారా ఒక రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన వైనం.
కానీ 1948 సెప్టెంబర్ 17న అసలు ఏం జరిగింది?
ఇది కేవలం ఒక “పోలీస్ చర్య” మాత్రమేనా?
హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశంగా ఉండాలని భావించిందా?
నిజాం ప్రభువు భారతదేశంలో కలవడానికి నిరాకరించారా?
ఈ మొత్తం అధ్యాయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాత్ర ఏమిటి?
అన్నింటికంటే ముఖ్యంగా, భారతదేశంలో హైదరాబాద్ విలీన చరిత్ర కేవలం విజయం, స్వాతంత్య్ర కథ మాత్రమేనా, లేక దీని వెనుక ఈనాటికి కూడా పూర్తిగా చర్చించని ఒక బాధాకరమైన అధ్యాయం కూడా దాగి ఉందా?
రండి, చరిత్ర పుటలను తెరుద్దాం.
హైదరాబాద్ దక్కన్ అనేది కేవలం నేటి తెలంగాణ పేరు మాత్రమే కాదు. నిజాం హైదరాబాద్ రాజ్యం ఒక విశాలమైన ప్రాంతంతో కూడుకుని ఉండేది. ఇందులో ప్రస్తుత తెలంగాణతో పాటు మరాఠ్వాడాలోని ఒక పెద్ద భాగం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు కూడా అంతర్భాగంగా ఉండేవి. ఇది బ్రిటిష్ ఇండియాలోనే అత్యంత పెద్దదే కాదు, ధనిక రాష్ట్రం కూడా. దీని చివరి పాలకుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.
ఇక 1947లో బ్రిటిష్ పాలన అంతమై, భారతదేశం , పాకిస్తాన్ అనే రెండు స్వతంత్ర దేశాలు ఏర్పడినప్పుడు, బ్రిటిష్ ప్రభుత్వ పరిధిలోని రాజ్యాల భవితవ్యంపై ప్రశ్న తలెత్తింది. చాలా వరకు సంస్థానాలు భారతదేశంలోనో లేదా పాకిస్తాన్లోనో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్ విషయం భిన్నంగా ఉంది.
హైదరాబాద్ తన ప్రత్యేక రాజకీయ హోదాను నిలబెట్టుకోవాలని నిజాం ఆకాంక్షించారు. హైదరాబాద్ భారతదేశంలో గానీ, పాకిస్తాన్లో గానీ చేరకుండా ఒక స్వతంత్ర రాజ్యంగానే ఉండిపోవాలనేది నిజాం వైఖరి. అయితే, ఇక్కడ ఒక ప్రాథమిక సత్యాన్ని విస్మరించలేము; భౌగోళికంగా హైదరాబాద్ భారతదేశం మధ్యలో ఉంది , దీని దాదాపు అన్ని భౌగోళిక సరిహద్దులు భారతదేశంతోనే ముడిపడి ఉన్నాయి. అందువల్ల భారతదేశం గుండెల్లో ఒక ప్రత్యేక స్వతంత్ర రాజ్యం ఉండటం అనేది ఇండియాకు ఆమోదయోగ్యంగా లేదు. భారతదేశం, హైదరాబాద్ మధ్య సంబంధాలను నిరంతరం ఉద్రిక్తంగా ఉంచిన ప్రధాన వివాదం ఇదే.
అలాగే 1947 నవంబర్లో భారతదేశం, హైదరాబాద్ మధ్య స్టాండ్స్టిల్ అగ్రిమెంట్, అనగా “యథాతథ స్థితి ఒప్పందం” కుదిరింది. దీని ప్రధాన ఉద్దేశ్యం తక్షణమే ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోకుండా, భవిష్యత్ సంబంధాలపై రెండు ప్రభుత్వాలు చర్చలు జరిపేంతవరకు ప్రస్తుత పాలనాపరమైన సంబంధాలను తాత్కాలికంగా కొనసాగించడం. అయితే ఈ ఒప్పందం ఎక్కువ కాలం శాంతిని నిలబెట్టలేకపోయింది.
హైదరాబాద్లో ఒకవైపు ప్రజాస్వామిక హక్కుల కోసం, భారతదేశంతో విలీనం కోసం ‘హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్’ ఉద్యమం కొనసాగుతుండగా, మరోవైపు కమ్యూనిస్ట్ కిసాన్ (రైతు) ఉద్యమం, ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో జాగీర్దారీ వ్యవస్థకు, వారి అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగింది. అంటే హైదరాబాద్ సమస్య కేవలం “భారతదేశం వర్సెస్ నిజాం” మాత్రమే కాదు; రాష్ట్రంలో అధికారం, భూమి, ప్రజాస్వామ్యం , సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రశ్నలు కూడా తలెత్తాయి. నేటి రాజకీయ కథనాలలో ఈ కోణాన్ని చాలాసార్లు విస్మరిస్తుంటారు.
ఇక రజాకార్ల విషయానికి వస్తే… ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ ఆధ్వర్యంలో ఖాసిమ్ రజ్వీ నాయకత్వంలో రజాకార్లు ఒక రాజకీయ, అర్ధ-సైనిక శక్తిగా రూపాంతరం చెందారు. రజాకార్లు హైదరాబాద్ స్వాతంత్య్రానికి, నిజాం పాలన పరిరక్షణకు మద్దతుగా నిలిచారు. భారతదేశంలో తక్షణ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వీరి కార్యకలాపాలు పరిస్థితులను మరింత క్లిష్టతరం చేశాయి.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. హైదరాబాద్ రాష్ట్రంలోని ముస్లింలందరూ రజాకార్లు కాదు, అలాగే నిజాం విధానాలన్నింటికీ వారు మద్దతుదారులు కూడా కాదు. అదేవిధంగా, హైదరాబాద్లోని హిందువులందరూ భారతదేశంతో తక్షణ విలీనానికి మద్దతు ఇచ్చినవారూ కాదు; వాస్తవ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ముస్లింలు సాధారణ పౌరులే కాగా, రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మాత్రం జాగీర్దార్ల చేతుల్లో ఉండేది. ఇందులో ఉన్నత కులాలకు చెందిన హిందువులు, ముస్లింలు ఇద్దరూ భాగస్వాములుగా ఉన్నారు.
ఈ సమయంలో , గ్రామీణ తెలంగాణలో రైతు ఉద్యమం నిజాం ప్రభుత్వ జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి సాయుధ పోరాటాన్ని ప్రారంభించింది. ఫలితంగా 1948 నాటికి హైదరాబాద్ అనేక సమాంతర వివాదాలకు కేంద్రంగా మారింది — ఒకవైపు నిజాం మరియు భారతదేశం మధ్య రాజకీయ ఘర్షణ, మరోవైపు రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం, మూడోవైపు రైతుల తిరుగుబాటు, నాలుగోవైపు రజాకార్ల సాయుధ కార్యకలాపాలు.
ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని భావించారు, కానీ హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ హైదరాబాద్ సమస్యను భారతదేశ అంతర్గత భద్రత , జాతీయ సమైక్యతతో ముడిపెట్టి చూశారు. పరిస్థితులు మరింత దిగజారాయి, చర్చలు విఫలమయ్యాయి. చివరకు 13 సెప్టెంబర్ 1948న భారత సైన్యం హైదరాబాద్కు వ్యతిరేకంగా సైనిక చర్యను ప్రారంభించింది, దీనినే “ఆపరేషన్ పోలో”, “పోలీస్ యాక్షన్” అని పిలుస్తారు.
భారత సైన్యం వివిధ దిశల నుండి హైదరాబాద్లో ప్రవేశించింది. హైదరాబాద్ సైన్యం , రజాకార్లు భారత సైన్యాన్ని ఎదుర్కోలేకపోయారు. సెప్టెంబర్ 17న నిజాం సైన్యం ఆయుధాలు కిందికి దించి (లొంగిపోయి) కాల్పుల విరమణ ప్రకటించింది. సెప్టెంబర్ 18 నాటికి భారత సైన్యం రాష్ట్రంపై పూర్తి నియంత్రణను సాధించింది. అలా హైదరాబాద్ స్వతంత్ర రాజకీయ అస్తిత్వం అంతరించి, భారత యూనియన్లో అంతర్భాగమైంది.
కానీ, ఇక్కడి నుంచే చరిత్ర మరింత క్లిష్టమైన అధ్యాయం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 17 తర్వాత అంతా ముగిసిపోయిందా? దీనికి సరళమైన సమాధానం – లేదు.
సైనిక చర్య ముగిసిన తర్వాత హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో మతపరమైన హింస చెలరేగింది. ముస్లింల హత్యలు, దోపిడీలు, ఆస్తుల విధ్వంసం, ఇతర అకృత్యాల గురించి అనేక విచారణలు , విద్యాపరమైన అధ్యయనాలు అందుబాటులో ఉన్నాయి. పండిట్ సుందర్లాల్ నేతృత్వంలో తయారైన నివేదిక (తరువాతి పరిశోధనలలో దీనిని పదేపదే ఉటంకిస్తారు), ఆపరేషన్ అనంతరం జరిగిన ఈ హింస వైపు మన దృష్టిని ఆకర్షిస్తుంది. సైనిక చర్య , ఆ తర్వాత జరిగిన హింస కేవలం సాధారణమైన లేదా ద్వితీయ శ్రేణి సంఘటన కాదని ఆధునిక చారిత్రక పరిశోధనలు కూడా అంగీకరిస్తున్నాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు సునీల్ పురుషోత్తమ్ తన పరిశోధనా అధ్యయనంలో, 1948 నాటి “పోలీస్ యాక్షన్” సమయంలో ఆ వెంటనే జరిగిన హింస ప్రత్యేకించి హైదరాబాద్ ముస్లింలను తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక పెద్ద చారిత్రక సత్యమని వాదించారు.
హైదరాబాద్పై నియంత్రణ సాధించిన తర్వాత భారత ప్రభుత్వానికి కేవలం పరిపాలనాపరమైన సమస్య మాత్రమే ఎదురుకాలేదని, హిందూ-ముస్లిం సంబంధాలు, రాష్ట్ర సంస్థలు మరియు మారుతున్న సామాజిక వ్యవస్థను కూడా చక్కదిద్దాల్సిన బాధ్యత దానిపై ఉందని టేలర్ షెర్మాన్ పరిశోధన కూడా వెల్లడిస్తోంది.
కాబట్టి మనం సెప్టెంబర్ 17 తేదీని కేవలం “విమోచన” లేదా కేవలం “విజయం” అనే ఒక్క పదంతో వర్ణిస్తే, చరిత్రలోని ఒక పెద్ద భాగాన్ని విస్మరించినట్లవుతుంది; అయితే దీనికి మరో కోణం కూడా అంతే ముఖ్యమైనది. నిజాం పాలన ప్రజాస్వామ్యబద్ధమైనది కాదు, రాష్ట్రంలో రాజకీయ స్వాతంత్ర్యం పరిమితంగా ఉండేది, జాగీర్దారీ వ్యవస్థపై రైతన్నలలో తీవ్రమైన ఆగ్రహం ఉండేది. తెలంగాణ రైతు ఉద్యమం సమాజంలో పాత అధికార నిర్మాణాలను సవాలు చేసింది. రజాకార్ల సాయుధ కార్యకలాపాలు కూడా పరిస్థితులను దిగజార్చడమే కాకుండా సాధారణ ప్రజలలో భయాన్ని నింపాయి.
అందువల్ల హైదరాబాద్ విలీనాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏకకాలంలో రెండు ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది:
నిజాం నిరంకుశ పాలన అంతం కావాల్సిందా? ఖచ్చితంగా కావాల్సిందే.
ప్రజలకు ప్రజాస్వామిక హక్కులు, సామాజిక న్యాయం దక్కాల్సిందా? ఖచ్చితంగా దక్కాల్సిందే.
కాని ఈ ఉద్దేశంతో జరిగిన సైనిక చర్యను , ఆ తర్వాత జరిగిన మతపరమైన హింసను ప్రశ్నించడం దేశద్రోహమా? అసలే కాదు.
చరిత్రను ప్రశ్నించడం అంటే చరిత్రను అవమానించడం కాదు, చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం.
ఇక్కడే నేటి రాజకీయాలు చరిత్రను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. ఒక రాజకీయ పార్టీ దీనిని “హైదరాబాద్ విమోచనం” అంటుంది. మరొకటి దీనిని కేవలం “విలీనం” అంటుంది; కొందరు సర్దార్ పటేల్ను ప్రధాన పాత్రధారిగా చేస్తారు, ఇంకెవరైనా నిజాంకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాన్ని కేంద్ర బిందువుగా మలుస్తారు, మరికొందరు రజాకార్ల అక్రమాలను ప్రముఖంగా చూపుతారు, కొందరైతే సైనిక చర్య తర్వాత ముస్లింలపై జరిగిన హింసను చరిత్రలో ప్రాథమిక అంశంగా మారుస్తారు. కానీ, ఒక గంభీరమైన చారిత్రక విశ్లేషణ ఈ అన్ని కోణాలను ఒకేసారి కలిపి చూడాలని డిమాండ్ చేస్తుంది.
ఈ విధంగా మనం 1948 హైదరాబాద్ విలీనం నుండి నేటి తెలంగాణ వరకు చరిత్రను పరిశీలిస్తే, ఇది కేవలం ఒక సైనిక చర్యకు సంబంధించిన చరిత్ర మాత్రమే కాదని మనకు అర్థమవుతుంది. ఇది అధికార మార్పిడి, ప్రజాస్వామ్యం, భూమి, భాష, ప్రాంతీయ గుర్తింపు, వర్గ పోరాటం, మతపరమైన సంబంధాలు మరియు సమాఖ్య (ఫెడరల్) రాజకీయాల సుదీర్ఘ గాథ.
ఇక నేటి రాజకీయాల విషయానికి వస్తే… సెప్టెంబర్ 17ని కేంద్రంగా చేసుకుని నేటికీ తెలంగాణలో రాజకీయ ఘర్షణలు ఎందుకు జరుగుతుంటాయి? దీనికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే – చరిత్ర కేవలం గతం మాత్రమే కాదు, చరిత్ర నేటి రాజకీయాలకు ఒక ఆయుధంగా కూడా మారుతుంది. ఏదైనా ప్రభుత్వం “హైదరాబాద్ విమోచన దినోత్సవం” (Hyderabad Liberation Day) జరిపినప్పుడు, అది వాస్తవానికి ఒక నిర్దిష్ట చారిత్రక కోణాన్ని ప్రజల ముందుంచుతుంది. ఏదైనా పార్టీ “జాతీయ సమైక్యత” (National Integration) గురించి మాట్లాడినప్పుడు, అది అదే సంఘటనను మరో కోణం నుండి ప్రదర్శిస్తుంది.
కాబట్టి అసలు సమస్య సెప్టెంబర్ 17కి ఏ పేరు పెట్టాలనేది కాకూడదు; అసలు సమస్య మనం చరిత్రను ఎంత నిజాయితీగా వివరిస్తున్నాం అనేది కావాలి. నిజాం నిరంకుశత్వం తప్పు అయితే, దానిని తప్పు అనాలి. తెలంగాణ రైతులు జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడితే, వారి త్యాగాలను కూడా చరిత్రలో సముచిత స్థానం కల్పించాలి. భారత సైనిక చర్య హైదరాబాద్ను భారత యూనియన్లో విలీనం చేసిందనే సత్యాన్ని అంగీకరించాలి; అలాగే ఈ చర్య తర్వాత నిరపరాధులైన ముస్లింల హత్యలు, ఆస్తుల విధ్వంసం జరిగితే వాటిని కూడా దాచిపెట్టకూడదు. ఎందుకంటే చరిత్ర పని ఏదో ఒక జాతిని హీరోగా, మరో జాతిని విలన్గా చూపించడం కాదు; సంఘటనలు ఎలా జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎవరు ఏంచేశారు , దాని ఫలితాలు ఏమిటనేది తెలియజేయడమే చరిత్ర అసలు కర్తవ్యం.
భారత యూనియన్లో హైదరాబాద్ దక్కన్ విలీనం అనేది ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక నిర్ణయాత్మక మలుపు. ఇది జరగకపోతే నేటి భారతదేశ భౌగోళిక స్వరూపం బహుశా వేరుగా ఉండేది. కానీ ఈ సంఘటన ప్రాముఖ్యత కేవలం “విజయం” లేదా “ఓటమి” అనే కోణంలో కాకుండా, ఇది ఒక సంక్లిష్టమైన చారిత్రక పరిణామంగా చూసినప్పుడే పూర్తిగా అర్థమవుతుంది.
చరిత్రను రాజకీయ ద్వేషాలను సృష్టించడానికి వాడుకుంటే శాంతిభద్రతలు క్షీణించే ప్రమాదం ఏర్పడుతుంది. కానీ చరిత్రను సత్యం, పరిశోధన , న్యాయంతో అధ్యయనం చేస్తే, అది జాతులను విభజించడానికి బదులుగా తమ తప్పుల నుండి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.
