హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఈమేరకు నిన్న ఆర్టీసీ ప్రతినిధులు, కార్మిక శాఖ కమిషనర్ మధ్య హైదరాబాద్లో జరిగిన సమావేశం విఫలమవడంతో, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సంయుక్త కార్యాచరణ సమితి (JAC) ఏప్రిల్ 22 నుండి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది.
“మా డిమాండ్లు నెరవేర్చకపోతే, ఏప్రిల్ 21- 22 తేదీల మధ్య రాత్రి, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత డిపో నుండి బయలుదేరాల్సిన మొదటి బస్సు డిపోలోనే ఉంటుందని” TGSRTC బహుజన కార్మిక సంఘం నాయకుడు సుద్దాల సురేష్ మీడియాతో తెలిపారు.
కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి, వరుసగా మూడవసారి కూడా RTC యాజమాన్యం గానీ, సంబంధిత రాజకీయ ప్రతినిధులు గానీ ఎవరూ హాజరుకాలేదని ఆయన పేర్కొన్నారు. TGSRTCని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం, 2021, 2025 వేతన సవరణలను ‘ఫిట్మెంట్’తో సహా అమలు చేయడం, RTC కార్మిక సంఘానికి గుర్తింపు కల్పించి ఎన్నికలు నిర్వహించడం, అలాగే వివిధ బకాయిలను చెల్లించడం వంటి 32 డిమాండ్లను JAC యాజమాన్యం ముందు ఉంచింది.
ఈ డిమాండ్లలో ప్రధానమైన వాటిలో ఒకటి సంస్థ ప్రైవేటీకరణకు సంబంధించినది. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రైవేటు ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) ప్రవేశపెట్టి, RTC బస్సులను జిల్లాలకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
‘మహాలక్ష్మి పథకం’ కింద మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాల నష్టాన్ని భర్తీ చేయడానికి, ప్రభుత్వం నెలకు రూ. 350 కోట్లు చెల్లించాలని కూడా సంస్థ కోరుతోంది.
కాగా, అక్టోబర్ 2019 పండుగ సీజన్ సమయంలో,BRS ప్రభుత్వ హయాంలో, RTC కార్మికులు 52 రోజుల కంటే ఎక్కువ కాలం కార్యకలాపాలను నిలిపివేసి, తెలంగాణ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన సమ్మెను నిర్వహించారు. ఆ ఆందోళనలో 50 మందికి పైగా RTC కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
అసలే ప్రయాణాలకు ఇది పీక్ సీజన్ కావడంతో సమ్మె జరిగితే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడతారు. అప్పట్లో అదే జరిగిందని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ఇప్పుడు కూడా నిత్యం బస్లపై ఆధారపడే ఉద్యోగులు, ఇతర వర్గాల ప్రజలకు సవాళ్లు తప్పవు. అందుకే ఉద్యోగులు సమ్మె వెళ్లకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఈమేరకు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నరు. అలాగే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంపై కమిటీ పనిచేస్తోందని తెలిపారు. అంతేకాదు కార్మికులు తమ సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వంతో చెప్పుకోవచ్చని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంత్రి సూచించారు.


