Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

రాజకీయ సంభాషణలో చతురత ప్రదర్శించిన రాహుల్ గాంధీ!

Share It:

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ‘రచనాత్మక్ కాంగ్రెస్’ జాతీయ సదస్సులో వ్యంగ్యం, చమత్కారంతో కూడిన రాజకీయ సంభాషణ ద్వారా వినూత్న శైలిని ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ విధానాన్ని, ‘హగ్ డిప్లొమసీ’ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తద్వార లోక్‌సభ ప్రతిపక్షనేత ఈ సమావేశాన్ని ఒక ఉత్సాహభరితమైన, పరస్పర సంభాషణలతో కూడిన, గాఢమైన రాజకీయ చర్చగా మార్చారు.

కాగా, రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై సూటి విమర్శలతో పాటు హాస్యాన్ని కూడా మేళవించారు. అదే సమయంలో అసాధారణంగా ప్రేక్షకులతో మమేకమయి ఆహూతులను ఆకర్షించారు. కొన్ని నెలల క్రితం రాహుల్‌ గాంధీ శైలి వేరు. కానీ జెన్ జెడ్ నేతృత్వంలోని నిరసనలు, వాటికి పెరుగుతున్న ప్రజా మద్దతు రాజకీయ వాతావరణం కారణంగా దానితో రాహుల్‌ గాంధీ మమేకమయ్యే శైలిని కూడా మార్చినట్లు కనిపిస్తోంది.

క్రమశిక్షణ వర్సెస్ భావప్రకటన’
నాటకీయ పద్ధతులను ఉపయోగించి, కాంగ్రెస్, బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపడానికి రాహుల్‌ గాంధీ ఈ సమావేశంలో ప్రయత్నించారు. అసమ్మతిని అణచివేసి ‘శాంతిభద్రతలను’ కాపాడాలని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కోరుకుంటున్నాయని, అయితే ‘స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తపరిచే’ భారతదేశానికే కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుందని ఆయన అన్నారు.

“జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నోరుమూయించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. దుఃఖంలో ఉన్న ఓ తల్లిని కూడా వారు మాట్లాడనివ్వలేదు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ మనపై జులుం ప్రదర్శించాలని చూశారు. అయితే భారతదేశం తన భావాలను వ్యక్తపరిచేలా చేసి, ఆ మౌనాన్ని బద్దలు కొట్టడమే మా పని,” అని రాహుల్‌ అన్నారు.

“ఒకరి మనసులో ఏమున్నా దాన్ని బహిరంగంగా మాట్లాడాలి, కానీ ఎవరూ ఎవరినీ అణచివేయకూడదు అన్నదే మా వైఖరి. హిందువు, ముస్లిం, సిక్కు, జైనుడు — ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు. దేశ భావప్రకటనా స్వేచ్ఛ బయటకు వచ్చినప్పుడే దేశ బలం యావత్ ప్రపంచానికి కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తులు దేశ భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడానికే కంకణం కట్టుకున్నారని” రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల విషయంలో కూడా రాహుల్‌ గాంధీ తీవ్రమైన విమర్శనాస్త్రాలు సంధించారు.

“మేము వాళ్లకు పిచ్చెక్కిస్తాం… ఈ రోజుల్లో నరేంద్ర మోదీకి రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి — కొన్ని స్పష్టమైనవి, కొన్ని రహస్యమైనవి. అమిత్ షాను చాణక్యుడితో సహా ఎన్నో రకాల బిరుదులతో పిలిచారు, కానీ ఆయన అదృశ్యమయ్యారు, పారిపోయారు. 20 రోజుల పాటు పార్లమెంటుకు హాజరు కాలేకపోయారు. ఇప్పుడు ఈ దేశం తన భావాలను వ్యక్తపరచకుండా ఆపలేమని ఈ ప్రభుత్వం గ్రహించిందని” రాహుల్‌ అన్నారు.

ఈ సమావేశంలోనే కాంగ్రెస్‌ నేత సందీప్ దీక్షిత్‌ను ఒక విదేశాంగ దేశాధినేత పాత్ర పోషించమని రాహుల్‌ గాంధీ కోరారు. వేదికపై ఆయనను కౌగిలించుకుని, మోదీ అనుసరిస్తున్న “కౌగిలింత దౌత్యాన్ని పరోక్షంగా విమర్శించారు. ఈ చర్యను ప్రధానమంత్రి గంభీరమైన దౌత్యానికి ప్రత్యామ్నాయంగా పొరబడ్డారని, దీని పర్యవసానాలు దేశ జాతీయ ప్రయోజనాలపై పడతాయని రాహుల్‌ సూచించారు.

ఆ తర్వాత రాహుల్‌ గాంధీ చైనా, సరిహద్దు పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై దృష్టి సారించారు. “భారతదేశానికి తన సొంత భూభాగంలో గస్తీ కాసే హక్కును చైనా నిరాకరించింది, కానీ ప్రభుత్వం ఈ వార్తను అణచివేసి దేశానికి నేరుగా హాని కలిగించింది. గాల్వాన్ తర్వాత, భారతదేశపు ఒక్క అంగుళం భూమి కూడా ఎవరి నియంత్రణలోనూ లేదని ప్రధాని మోదీ అన్నారు, అయితే భూమి ఆక్రమణకు గురైందని సైన్యం మాట్లాడింది. ఈ విషయంపై సైన్యం చైనాతో చర్చలు జరిపినప్పుడు, స్వయంగా భారత ప్రధాని దీనిని ఇప్పటికే ఖండించారని వారికి చెప్పారని” రాహుల్‌ అన్నారు.

“మరో మాటలో చెప్పాలంటే, మోదీ ప్రభుత్వం దేశాన్ని అన్ని వైపుల నుండి నాశనం చేసింది. వారి దృష్టి మొత్తం తమ రాజకీయ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, అదానీ నుండి డబ్బు తీసుకోవడంపైనే ఉందని” రాహుల్‌ గాంధీ అన్నారు.

ఈ ప్రసంగంలో రాహుల్‌ గాంధీ వ్యంగ్యం, హాస్యం మధ్య సునాయాసంగా సమతుల్యం పాటిస్తూ, ప్రేక్షకులను కేవలం శ్రోతలుగా కాకుండా ఈ చర్చలో భాగస్వాములుగా ఉపయోగించుకున్నారు.

మొత్తంగా ఈ పోటీ ఇకపై కేవలం రెండు పార్టీల మధ్య మాత్రమే కాదు, బలవంతంగా రుద్దిన వ్యవస్థకు, తనను తాను వ్యక్తీకరించుకోవడానికి నిశ్చయించుకున్న భారతదేశానికి మధ్య జరుగుతోందన్న రాజకీయ సందేశం రాహుల్‌ గాంధీ స్పష్టంగా చూపారు.

Xలో ‘రచనాత్మక్ కాంగ్రెస్’ జాతీయ సదస్సు

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.