వాషింగ్టన్: యూఎస్లో మధ్యంతర ఎన్నికల వేళ అమెరికా ఓటర్లలో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న యుద్ధ తీవ్రతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించి చూపుతున్నారు. కాగా, అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి. అధ్యక్షుడి పదవీకాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే ఈ ఎన్నికలు విజయం సాధించేందుకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఆలోచిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు సీనియర్ సహాయకులతో ట్రంప్ సమావేశం అయ్యారు.
ఆరు నెలలుగా సాగుతున్న ఈ సుదీర్ఘ పోరాటం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోయినప్పటికీ, ట్రంప్,ఆయన యంత్రాంగం దీనిని “సైనిక ఘర్షణ” (Military Conflict) గానే అభివర్ణిస్తూ, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో జరిగిన వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాలతో పోలిస్తే ఇందులో అమెరికా సైనికుల ప్రాణనష్టం చాలా తక్కువ (18 మంది మరణించారు) అని ఆయన సమర్థించుకున్నారు. అంతేకాదు ఉపాధ్యక్షుడు వాన్స్ కూడావైట్ హౌస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎలాంటి ‘దాడులు’ జరగడం లేదని, కాబట్టి దీనిని తానేమాత్రం “యుద్ధం” అని పిలవనని పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో ఇరాన్తో యుద్ధాన్ని ముగించి ఆర్థిక ఒత్తిడిని కొనసాగించడం ద్వారా ఇరాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ వ్యక్తిగతంగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆర్థిక ఆంక్షలు, ఒత్తిడిని కొనసాగిస్తే టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా చేయవచ్చని.. లేదంటే చివరకు ఇరాన్ పాలక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు చివర్లో వచ్చిన రాయిటర్స్/ఇప్సోస్ పోల్ ప్రకారం కేవలం 31% మంది అమెరికన్లు మాత్రమే ఈ యుద్ధాన్ని సమర్థిస్తుండగా, 63% మంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా యుద్ధం కారణంగా ఇంధన ధరలు విపరీతంగా పెరగడం రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంది. రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్పై తమకున్న స్వల్ప ఆధిక్యతను కాపాడుకోవడానికి ఈ యుద్ధ వార్తలు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చూడాలని ట్రంప్ సహాయకులు ప్రయత్నిస్తున్నారు. “మేం ఇరాన్పై ఒత్తిడి కొనసాగిస్తున్నాం. కానీ నవంబర్ ఎన్నికలు మాకు ప్రాధాన్యం” అని వైట్హౌస్ అధికారి ఒకరు తెలిపినట్లు మీడియా సమాచారం. ట్రంప్ ప్రభుత్వం ఈ ఘర్షణను తక్కువ చేసి చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.


