న్యూఢిల్లీ: గిరిజన హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్ తన అమ్మమ్మ అంతక్రియల అనంతరం చేపట్టే ఆచార వ్యవహారాలకు హాజరయ్యేందుకు వీలుగా సుప్రీంకోర్టు జూన్ 21న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
వివాదాస్పద ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన మొదటి ఐదుగురిలో మహేశ్ రౌత్ ఒకరు. ఈ కేసులో 16 మంది రచయితలు, జర్నలిస్టులు, కార్యకర్తలు, న్యాయవాదులను అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణల అనంతరం కొందరికి బెయిల్ లభించింది. ఈ కేసు ఇంకా విచారణకు వెళ్లాల్సి ఉంది.
రౌత్ 2018 జూన్లో అరెస్టయ్యాడు. అప్పటి నుండి జైలులో ఉన్నాడు. సెప్టెంబర్ 21, 2023న బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే రెండు రోజుల తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన అప్పీల్పై సుప్రీం కోర్టు విడుదల ఉత్తర్వులను నిలిపివేసింది.
జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టీ ధర్మాసనం ఇప్పుడు రౌత్ను జూన్ 26 నుండి జూలై 9 వరకు విడుదల చేయడానికి అనుమతించారు. అతను జూలై 10న తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది.
తన అమ్మమ్మ అంత్యక్రియలు ఇప్పటికే పూర్తయ్యాయన్న కారణంతో NIA న్యాయవాది అతని బెయిల్ను వ్యతిరేకించారని డెక్కన్ హెరాల్డ్ నివేదించింది. జూన్ 29, 30, జూలై 5, 6 తేదీల్లో రెండు ఆచారాలు నిర్వహిస్తామని రౌత్ తరఫు న్యాయవాది అపర్ణా భట్ చెప్పడంతో ధర్మాసనం దీనిని తిరస్కరించింది.
జూన్ 29ా, 30, జులై 5, 6 తేదీల్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వీలుగా తాత్కాలిక బెయిల్ను ఇవ్వాలని కోరుతూ రౌత్ దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ పిటిషన్ను విచారించిన బెంచ్ బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
‘వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఈ వ్యక్తి ఇప్పటికే అనుభవించిన జైలు శిక్షను గమనంలోకి తీసుకుని, పైగా చేసిన అభ్యర్థన స్వభావాన్ని గుర్తిస్తూ పిటిషన్దారుడికి రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేయాలని నిర్ణయించాం’ అని బెంచ్ పేర్కొంది. అవసరమైతే రౌత్ విడుదలకు విధించాల్సిన నిబంధనలు, షరతులను ట్రయల్ కోర్టును నిర్ణయించాల్సిందిగా కోరే స్వేచ్ఛ ప్రత్యేక కోర్టు, జాతీయ దర్యాప్తు సంస్థ వుంటుందని పేర్కొంది.
జైలు నుంచి విడుదల అయ్యాక రౌత్ గడ్చిరోలిలోని తన ఇంటికి వెళ్లనున్నారు.