న్యూఢిల్లీ: బిహార్ తరహాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే ఓటర్ల జాబితాల సవరణ (SIR) నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు నేటి సాయంత్రం ఈసీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈరోజు సాయంత్రం 4.15 గంటలకు ఈసీ విలేకరుల సమావేశం నిర్వహిస్తుందని మాత్రమే ఆహ్వానంలో పేర్కొన్నప్పటికీ, ఓటర్ల జాబితాల ఇంటెన్సివ్ రివిజన్ గురించి ఈ సమావేశమని అధికారులు తెలిపారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో సహా 10 నుండి 15 రాష్ట్రాల్లో SIR మొదటి దశను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది.
కాగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న, జరగడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో…ఆయా ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉండంతో వాటి జోలికి వెళ్లరాదని భావిస్తోంది.
ఈ నెల 23, 24 తేదీల్లో దేశరాజధానిలో జరిగిన ప్రధాన ఎన్నికల అధికారులు సమావేశంలో దేశవ్యాప్త ఎస్ఐఆర్ కోసం సన్నద్ధతపై చర్చించిన విషయం తెలిసిందే. ఈసీ చేపట్టనున్న ఈ దేశవ్యాప్త ఓటరు జాబితా ప్రక్షాళన, భారత ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచే దిశగా ఓ కీలక ముందడుగు అని ఈసీ చెబుతుండగా…బీహార్ అనుభవాల దృష్ట్యా ఇండియా కూటమి మాత్రం ఈ ప్రక్రియపై పెదవి విరుస్తోంది.


