హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే నియోజకవర్గంలో పేరుకు పోయిన పౌర సమస్యలను పరిష్కరించాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈమేరకు కాలనీలు, ఫోరమ్లు, స్థానిక సంక్షేమ సంఘాలు (RWAలు) ఏకగ్రీవంగా తమ స్వరాన్ని వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ పౌర సమస్యలను పరిష్కరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో…ఎన్నికైన MLA ద్వారా తమ పరిసరాల్లోని సమస్యలు పరిష్కరించుకోవడానికి వీలుగా ఫిర్యాదులను లేవనెత్తుతున్నాయి. పాడయిపోయిన రోడ్లు, పేలవమైన డ్రైనేజీ, దోమల బెడద, ట్రాఫిక్ గందరగోళం, ఫుట్పాత్లు లేకపోవడం,కలుషితమైన చెరువులు వంటి సమస్యలు ఉంటున్నాయి. నీటి కాలుష్యం, పారిశుధ్యం, నీటి వనరుల ఆక్రమణ, ఓపెన్ డ్రెయిన్ల పునరుద్ధరణ వంటి ఆందోళనలను కూడా కాలనీవాసులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
ఈమేరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కాలనీల ఫోరం అధ్యక్షుడు ఆసిఫ్ హుస్సేన్ సోహైల్ మాట్లాడుతూ, ఫోరం సభ్యులు తమ తమ వార్డులలో లేవనెత్తిన సమస్యల జాబితాను మేము సిద్ధం చేశామని అన్నారు. “పోటీ చేసే అభ్యర్థి మద్దతు కోరుతూ వివరణాత్మక చర్చల తర్వాత కాలనీలు, స్థానికులు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు.” 300 కి పైగా కాలనీలు, సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఫోరం… అనేక పౌర, ఉద్యానవన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతులను విజయవంతంగా పొందింది. “పెరుగుతున్న పౌర సమస్యలను పరిష్కరించడానికి మనకు సరైన ప్రణాళిక ఉండాన్నారు. అంతేకాదు దీనికోసం సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం” అని ఆసిఫ్ హుస్సేన్ అన్నారు.
ముఖ్యంగా రోడ్ల పరిస్థితిని కాలనీ సంక్షేమ సభ్యులు హైలైట్ చేశారు. “ఎన్నికైన ప్రతినిధి ఈ సమస్యలను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇరుకైన దారులు పార్కింగ్ రద్దీకి దారితీస్తాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. వ్యర్థాల నిర్వహణ, రోడ్డు పక్కన ఉన్న శిథిలాల కుప్పలు, మౌలిక సదుపాయాలు గందరగోళంగా ఉన్నాయి” అని యూసుఫ్గూడ నివాసి శ్రీకాంత్ అన్నారు. విరాట్ నగర్ నివాసి, ఫోరమ్ సభ్యురాలు మెహెరున్నీసా మాట్లాడుతూ… ఈ ప్రాంతంలో ఓపెన్ నాలా ప్రధాన సమస్య. ఇది గత రెండు దశాబ్దాలుగా అలాగే ఉందని అన్నారు.
వర్షాల సమయంలో ఈ ప్రాంతంలోని అనేక లేన్లు మునిగిపోతాయి. దీనితో పాటు, ఇతర ప్రధాన పౌర సమస్యలను అభ్యర్థుల దృష్టికి తీసుకురావాలని మేము నిర్ణయించుకున్నాము” అని.. మహిళా సంస్థను కూడా నిర్వహిస్తున్న మెహెరున్నీసా అన్నారు. ఎర్రగడ్డ వాసి, ఫోరమ్ సభ్యుడు వినోద్ రెడ్డి మాట్లాడుతూ… కలుషిత నీరు, కొండలా పేరుకుపోయిన చెత్త సమస్యను హైలైట్ చేశారు. “మాకు విద్యుత్, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, రోడ్లు ప్రతిచోటా గుంతలతో పేలవమైన స్థితిలో ఉన్నాయి. ప్రధాన రోడ్లు బాగానే ఉన్నాయి. కానీ లోపలి లేన్లు అస్సలు బాగాలేవు. ఈ ప్రాంతం గుండా ప్రయాణించడం కష్టం”అని షేక్పేట నివాసి, ఫోరమ్ సభ్యుడు రవి యాదవ్ అన్నారు.


