పాట్నా: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నిన్నటి పేలుడు తర్వాత ఎన్నికలు జరుగుతున్న బీహార్ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. నేడు జరిగే చివరి దశ అసెంబ్లీ ఎన్నికలకు బీహార్ అంతటా ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈమేరకు డీజీపీ కుమార్ పీటీఐతో మాట్లాడుతూ….ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు తర్వాత బీహార్ అంతటా హై సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించామని అన్నారు.
“ పెట్రోలింగ్ను ముమ్మరం చేయడం ద్వారా దేశ వ్యతిరేక శక్తులు చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకోవడానికి బీహార్ పోలీసులు అనేక విభాగాలను నిశితంగా పరిశీలించి, అసాధారణ నిఘా ఉంచాలని ఆదేశించారు” అని ఆయన అన్నారు. బోధ్ గయలోని మహాబోధి ఆలయ సముదాయం, రాజ్గిర్లోని విశ్వశాంతి స్థూపం, మహావీర్ ఆలయం, పాట్నాలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ వంటి పర్యాటక ఆకర్షణలన్నింటిలోనూ భద్రతను పెంచినట్లు బీహార్ పోలీసు వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.
తొలి దశ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విజయంపై వేటికవే ధీమా వ్యక్తం చేయగా.. రెండో దశ గెలుపోటములను శాసించనుంది. ఈ క్రమంలో దేశ రాజధానిలో జరిగిన బాంబు పేలుడు ఘటన ఎన్నికలపై ప్రభావం చూపించే సూచనలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశ రాజధానిలో బాంబు పేలుడు జరిగినపుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్లోనే ఉన్నారు. వార్త తెలియగానే.. ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


