Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

విద్వేషపూరిత ప్రసంగాల ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం!

Share It:

హైదరాబాద్: మత సామరస్యాన్ని దెబ్బతీసి, హింస, ఘర్షణలను ప్రేరేపించే విద్వేషపూరిత ప్రసంగాలను, సోషల్ మీడియా పోస్టులను అరికట్టడానికి ఉద్దేశించిన ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాలు- విద్వేష నేరాల నివారణ బిల్లు, 2026’కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారతదేశంలోనే మొట్టమొదటి విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష నేరాల (నివారణ) బిల్లును కాంగ్రెస్ పాలనలోని కర్ణాటక గత ఏడాది డిసెంబర్ 18న ఆమోదించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ బిల్లు రాజ్యాంగబద్ధతపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ, రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ దీనిని భారత రాష్ట్రపతి సమీక్ష కోసం రిజర్వ్ చేయడంతో, ఇది ఇంకా చట్టంగా మారలేదు.

విద్వేషపూరిత ప్రసంగాల బిల్లు అనేది బెయిల్ లేని నేరం. మతపరమైన అశాంతిని కలిగించే లక్ష్యంతో మౌఖికంగా, సోషల్ మీడియాలో, ముద్రణ రూపంలో చేసే ప్రసంగాలను ఇది నేరంగా పరిగణిస్తుంది.

తల్లిదండ్రుల సహాయ నిధి బిల్లు
తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల జీతంలోంచి రూ.10,000 లేదా 15 శాతం కోత విధించేందుకు వీలు కల్పించే ‘తల్లిదండ్రుల సహాయ నిధి బిల్లు’ ముసాయిదాను కూడా కేబినెట్ ఆమోదించింది. ఈ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందజేస్తారు.

‘రోహిత్ వేముల బిల్లు’ విధివిధానాలను రూపొందించడానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. దీనికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షత వహించగా, మంత్రులు దామోదర్ రాజా నరసింహ, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు.

ఇది కూడా కర్ణాటక ప్రభుత్వం ఆమోదించిన ‘రోహిత్ వేముల (వివక్ష లేదా అన్యాయ నివారణ) చట్టం’లాంటిదే. ఈ చట్టం ఆమోదం పొందిన తర్వాత, ఉన్నత విద్యాసంస్థలలో కుల ఆధారిత వివక్ష, వేధింపులను నివారించడమే దీని లక్ష్యంగా ఉంటుంది.

లంగాణ గిగ్ వర్కర్స్ బిల్లు
న్యాయవాదులను పరిరక్షించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుతో పాటు, తెలంగాణ ప్లాట్‌ఫామ్, గిగ్ వర్కర్స్ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన అన్ని ద్రవ్య లావాదేవీలను నిర్వహించడానికి హెచ్‌ఎం‌ఆర్‌ఎల్‌ను నోడల్ అథారిటీగా నియమించడం ద్వారా, ఎల్&టి నుండి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అంతేకాదు తెలంగాణలో నిర్వహించిన కుల గణనపై జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి సమర్పించిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags :

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.