న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ నియంత్రణలో ఉన్న మెస్సర్స్ రిలయన్స్ కమ్యూనికేషన్స్కు చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను రూ. 2929 కోట్ల బ్యాంకు మోసం కేసులో అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తెలిపింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిర్యాదు మేరకు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, అనిల్ అంబానీ,ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక కేసు నమోదు చేసింది. ఎస్బిఐ ప్రకారం… ఈ మోసం వల్ల బ్యాంకుకు సుమారు రూ. 2,929.05 కోట్ల అక్రమ నష్టం వాటిల్లింది. కాగా, 17 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో మొత్తం నష్టాలు రూ. 19,694.33 కోట్లుగా అంచనా వేసారు.
కంపెనీ అధికారుల నియంత్రణలో ఉన్న షెల్ ఎంటిటీల ద్వారా రిలయన్స్ కమ్యూనికేషన్స్ పరోక్ష లావాదేవీలలో నిమగ్నమైందని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. గ్రూప్ సంస్థలతో బూటకపు సేవా సంబంధిత లావాదేవీల కోసం డిస్కౌంటెడ్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LCలు) ఉపయోగించినట్లు కూడా ఈ విచారణ సూచిస్తోంది. ఈ లావాదేవీలు తదనంతరం బ్యాంకులకు చేరి, వాటికి గణనీయమైన నష్టాలను కలిగించాయి.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ జాయింట్ ప్రెసిడెంట్గా పనిచేసిన డి. విశ్వనాథ్, గ్రూప్ బ్యాంకింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉన్నారని, రుణ సౌకర్యాల మంజూరు, పంపిణీ కోసం బ్యాంకులతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన అనిల్ కల్యా, ఆయనకు మద్దతు ఇచ్చారని, కార్పొరేట్ ఫైనాన్స్, బ్యాంకింగ్ కార్యకలాపాలు, నిధుల వినియోగ నిర్వహణలో సహాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఉన్న ఈ ఇద్దరు ఎగ్జిక్యూటివ్లను సంబంధిత న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) నుండి అందిన ఫిర్యాదుల ఆధారంగా, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్పై ఇటీవలి నెలల్లో ఏడు కేసులు నమోదు చేసినట్లు కూడా ఏజెన్సీ పేర్కొంది. ఈ ఫిర్యాదులలో వేల కోట్ల రూపాయల భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

