చండీగఢ్: అక్టోబరు 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా హర్యానా ప్రజలను కోరారు. దుర్మార్గం, అన్యాయం, అవాస్తవానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
హర్యానాలోని జల్నాలో తన పార్టీ అభ్యర్థి, ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్కు మద్దతుగా ప్రియాంక ప్రచారం చేయడానికి వచ్చారు.
ఉపాధి కల్పన, అగ్నివీర్ మిలటరీ రిక్రూట్మెంట్ స్కీమ్, రైతుల సంక్షేమం వంటి ఇతర సమస్యలపై బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రియాంక మాటల దాడి చేసారు. అధికార పార్టీ ప్రతి దశలోనూ ప్రజలను “ద్రోహం” చేసిందని ఆరోపించారు.
“కురుక్షేత్ర యుద్ధం, బ్రిటీష్ పాలనపై పోరాటంతేడా ఏమీ లేదు. ప్రస్తుతం పరిస్థితులు దీనికి భిన్నంగా ఏమీ లేవు. బీజేపీపై పోరాడే అవకాశం మళ్లీ వచ్చిందని”ఆమె చెప్పింది. “ఈ రోజు, మీరు అన్యాయం, అసత్యం, దుర్మార్గులపై మీరు పోరాటం చేయాలి. అందు కోసం మీరు ధైర్యంగా నిలబడాలి, మీలో మీరు చూసుకోవాలి. ఏమి జరుగుతుందో చూడాలి”అని ప్రియాంక అన్నారు.
మోడీ ప్రభుత్వం కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం “అంబానీ-అదానీలకు అన్నీ” ఇచ్చినందున ఉపాధి అవకాశాలను సృష్టించలేకపోయిందని అన్నారు.
ఓడరేవులు, భూములు, పరిశ్రమలు, విమానాశ్రయాలు అన్నీ బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చారని ఆమె అన్నారు. చిన్న వ్యాపారాలకు, వ్యవసాయ రంగానికి నేడు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని గాంధీ అన్నారు.
“అది (బిజెపి ప్రభుత్వం) ఉపాధి కల్పించే పనిని చేయదు, ఎందుకంటే దాని విధానాలు దానికి విరుద్ధంగా ఉన్నాయి” అని ఆమె పేర్కొన్నారు.
అగ్నిపథ్ పథకాన్ని ప్రస్తావిస్తూ, అగ్నివీరులకు ఎలాంటి పింఛను లభించదని, నాలుగేళ్ల సర్వీసు తర్వాత మళ్లీ ఉపాధి కోసం వెతకాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మోదీజీ మీకు ఇచ్చినది ఇదే’’ అని ఆమె అన్నారు.
‘పరివార్ పెహచాన్ పత్ర’ పథకంపై బిజెపి ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందని గాంధీ విమర్శించారు. “మిమ్మల్ని పదేళ్లుగా తప్పుదోవ పట్టిస్తున్నారు. పదేళ్లుగా రైతులు, జవాన్లు, రెజ్లర్లు, మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆమె అన్నారు.
ఇప్పుడు రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్ నేత ప్రస్తావిస్తూ, రైతు సమాజానికి అన్యాయం జరిగిందని అన్నారు. “ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని నిరసన తెలుపుతున్న రైతులను కలవడానికి మోడీ ఐదు నిమిషాలు బయటకు రావడానికి వీలు పడలేదు” అని ఆమె అన్నారు.
“అతను (మోడీ) మిమ్మల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే వ్యవసాయ చట్టాలను తీసుకురాబోతున్నాడు. ఆ వ్యవసాయ చట్టాల వల్ల బడా పారిశ్రామికవేత్తలు మాత్రమే లాభపడతారని ఆయనకు తెలుసు. రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగదు. మీరు చాలా నెలలు పోరాడారు, మీరు దెబ్బలు తిన్నారు. 750 మంది రైతులు మరణించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వారు పశ్చాత్తాపపడ్డారు” అని గాంధీ ఆరోపించారు.
24 పంటలకు ఎమ్ఎస్పి ఇస్తామన్న బిజెపి ప్రభుత్వ వాదనపై ఆమె దుమ్మెత్తిపోస్తూ, వాటిలో 10 హర్యానాలో కూడా పండలేదని అన్నారు.“ఎవరిని మోసం చేస్తున్నారు? దేశం మొత్తం చూస్తోంది’ అని గాంధీ అన్నారు. “ఈ ప్రభుత్వాన్ని మార్చండి. బీజేపీని తరిమికొట్టండి’’ అని ప్రియాంక సభికులకు విజ్ఞప్తి చేశారు.