టెల్అవీవ్: ఇజ్రాయెల్ తన ప్రతిష్టాత్మక వాయు రక్షణ వ్యవస్థ ఐరన్డోమ్ను తొలిసారిగా విదేశాల్లో అమర్చనుంది. ఇరాన్తో యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఒక ఐరన్ డోమ్ బ్యాటరీతో పాటు సైనిక సిబ్బందిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి పంపినట్లు అమెరికా, ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ నివేదిక వెల్లడించింది.
గల్ఫ్ అంతటా ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ యూఏఈపై నిరంతర క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన తర్వాత, సంఘర్షణ ప్రారంభ దశలో ఈ మోహరింపు జరిగింది. ఈ విషయాన్ని ఇంతకుముందు బహిరంగంగా వెల్లడించలేదు.
కీలకమైన పౌర, సైనిక మౌలిక సదుపాయాలకు ముప్పు వాటిల్లడంతో అబుదాబి తన మిత్రదేశాల నుంచి తక్షణ సహాయం కోరినట్లు తెలిసింది. యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్ సంభాషణ అనంతరం, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఒక ఐరన్ డోమ్ బ్యాటరీతో పాటు ఇంటర్సెప్టర్లు, డజన్ల కొద్దీ సిబ్బందిని మోహరించాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలను ఆదేశించినట్లు అమెరికన్ మీడియా సంస్థ నివేదించింది.
ఒక సీనియర్ ఇజ్రాయెల్ అధికారి ప్రకారం, ఇజ్రాయెల్ మరో దేశంలో ఐరన్ డోమ్ బ్యాటరీని మోహరించడం ఇదే మొదటిసారి. అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత ఈ వ్యవస్థను ఉపయోగించిన మొదటి దేశం యూఏఈ అయింది.
ఐరన్ డోమ్ అనేది స్వల్ప-శ్రేణి రాకెట్లు, ఫిరంగి గుళ్లను అడ్డుకుని, నిర్వీర్యం చేయడానికి రూపొందించిన వాయు రక్షణ వ్యవస్థ. అమెరికా నుండి గణనీయమైన మద్దతుతో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో భాగస్వామ్యంతో రాఫెల్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ, 90 శాతానికి పైగా విజయవంతమయింది. ఇది ఇజ్రాయెల్ బహుళ-అంచెల రక్షణ నిర్మాణంలో అత్యంత లోపలి పొరగా ఉండి, 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించే ముప్పు నుండి పౌర ప్రాంతాలకు రక్షణ కల్పిస్తుంది.
ఐరన్ డోమ్ మోహరింపుతో పాటు, ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం పొడవునా ఇరు దేశాలు సన్నిహిత సైనిక, రాజకీయ సమన్వయాన్ని కొనసాగించాయని ఇజ్రాయెల్, యూఏఈ అధికారులు తెలిపారు. యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలపై ముప్పును ప్రయోగించక ముందే వాటిని నిర్వీర్యం చేసే లక్ష్యంతో, ఇజ్రాయెల్ దక్షిణ ఇరాన్లోని స్వల్ప-శ్రేణి క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అనేక వైమానిక దాడులను కూడా నిర్వహించింది.
2020లో అబ్రహం ఒప్పందాల కింద సంబంధాలు సాధారణీకరించినప్పటి నుండి, యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు ఒక బహిరంగ, వేగంగా విస్తరిస్తున్న వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరిణామం చెందాయి. ఒక చారిత్రాత్మక దౌత్య పురోగతిగా ప్రారంభమైంది. నిపుణులు భావిస్తున్నట్లుగా అంతకంతకూ ఏకీకృతమవుతున్న జాతీయ ప్రయోజనాల కారణంగా, అప్పటి నుండి భద్రత, రక్షణ, గూఢచార, సాంకేతిక రంగాలలో బలమైన సహకారంగా నిలిచింది.
